హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రజాసమస్యలపై నిలదీస్తున్న ప్రతిపక్ష బీఆర్ఎస్కు జవాబివ్వలేక అధికారపక్షం దౌర్జన్యానికి దిగింది. అసెంబ్లీ వేదికగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు పూనుకొన్నది. ప్రజల తరఫున ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తూ ముచ్చెటలు పట్టిస్తున్న ప్రతిపక్షాన్ని అసెంబ్లీకే రాకుండా నిలువరించింది. ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీని నిర్వహించింది. సర్కార్ తీరును చూసి రాజకీయ విశ్లేషకులు ముక్కున వేలేసుకుంటుండగా, రాష్ట్ర ప్రజానీకం దుమ్మెత్తిపోస్తున్నారు. హామీల పేరిట ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ నల్ల టీషర్టులను ధరించి సోమవారం ఉదయం బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీకి తరలివెళ్లారు.
ఆనవాయితీ ప్రకారం ముందుగా నేతలంతా గన్పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం అసెంబ్లీలోకి వెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి తెలంగాణ భవన్లో నిర్బంధించారు. ప్రధాన ప్రతిపక్షాన్ని అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న సర్కార్ మరోవైపు సభను ప్రారంభించింది. వాస్తవంగా సోమవారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సెంట్రల్ హాల్ ప్రారంభోత్సవం అనంతరం 10 గంటలకు సభను ప్రారంభించాల్సి ఉన్నది. ఎజెండా ప్రకారం తొలుత ప్రశ్నోత్తరాలు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమగ్రశిక్షణ, పీఎంశ్రీ స్కూల్స్, మెట్రోరైల్ తదితర వాటికి సంబంధించిన ఆడిట్ రిపోర్టులను నివేదిస్తారని తెలిపింది.
కానీ ఈ ఎజెండాను పక్కకునెట్టి ప్రభుత్వం సభను నిర్వహించింది. 24 నిమిషాలు కొనసాగించి 15నిమిషాల బ్రేక్ అంటూ వాయిదా వేసింది. సమావేశాలను తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభించారు. అందులోనూ ఎజెండా అంశాలేవీ లేవు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనుసన్నల్లో పలువురు మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రసంగాలను కొనసాగించారు. ప్రజాసమస్యలను పక్కకునెట్టి కేవలం ఎమ్మెల్సీ తాత మధు వ్యాఖ్యల చుట్టూనే సభను ప్రభుత్వం కొనసాగించింది. ఇదిలా ఉండగా సభను ఉదయం సీఎం కార్యక్రమం కోసమే వాయిదా వేసినట్టుగా ఉన్నది. సభ వాయిదా అనంతరం రేవంత్రెడ్డి సీపీఎం నేత సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు. తిరిగి వచ్చిన అనంతరమే సభ ప్రారంభం కావడం గమనార్హం.