ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?
కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కారు లేఖ
హైదరాబాద్, మార్చి10 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా చేపడుతున్న హంద్రీ-నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ఫేజ్-2 పనులను వెంటనే నిలువరించాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. అక్రమ నీటి మళ్లింపును అడ్డుకోవాలని ఇప్పటికే అనేకమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కేఆర్ఎంబీ చైర్మన్కు తెలంగాణ సాగునీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్ గురువారం లేఖ రాశారు. శ్రీశైలం నుంచి ఏపీకి కేవలం 34 టీఎంసీలే కేటాయించారని పేర్కొన్నారు. ఇప్పటికే హంద్రీ-నీవా సుజల స్రవంతి ద్వారా ఏపీ ప్రభుత్వం కృష్ణానీటిని కర్నూలు-కడప కెనాల్కు తరలించి, అక్కడి నుంచి బేసిన్ అవతలికి తీసుకెళ్తున్నదని అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనిపై ట్రిబ్యునల్-2 ఎదుట వాదనలు కొనసాగుతున్నాయని గుర్తుచేశారు. ఇప్పటికైనా బోర్డు స్పందించి, హంద్రీనీవా విస్తరణ పనులను చేపట్టకుండా అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.