హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): యాక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం (ఏఐబీపీ) ప్రాజెక్టులకు సంబంధించి పనులు ఇప్పటికే 98 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనుల పూర్తికి మరో రూ.140 కోట్లు అవసరమవుతాయని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది. నిధులను సత్వరమే విడుదల చేయాలని ప్రతిపాదన పెట్టింది. ప్రపంచబ్యాంకు నిధులతో కేంద్రం ఐదేండ్ల క్రితం ఏఐబీపీకి శ్రీకారం చుట్టింది. ఈ ప్రోగ్రాం కింద డిస్ట్రిబ్యూటరీ కాలువలు, పిల్ల కాలువలను నిర్మించి ఆయకట్టుకు సాగునీరందించాల్సి ఉన్నది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఏఐబీపీ ప్రాజెక్టుల పురోగతిపై కేంద్ర జల్శక్తిశాఖ గురువారం సమీక్షించింది. వర్చువల్గా సాగిన ఈ సమావేశంలో జలసౌధ నుంచి రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీ మురళీధర్ పాల్గొన్నారు.
ఏఐబీపీలో భాగంగా రాష్ట్రంలో చేపట్టిన దేవాదుల, రాజీవ్భీమా, ఎస్సారెస్పీ 2, నీల్వాయి, కుమ్రంభీం తదితర మొత్తం 8 ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. ఇప్పటికే పనులు 98 శాతం పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన పనుల పూర్తికి చాలా చోట్ల భూసేకరణ, ఆర్అండ్ఆర్ తదితర సమస్యలు ఆటంకంగా మిగిలాయని వివరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి అదనంగా రూ.140 కోట్లకు పైగా నిధులు అవసరమని ప్రతిపాదించారు. ఆ నిధులను సత్వరమే మంజూరు చేయాలని, త్వరితగతిన పనులు పూర్తిచేస్తామని వెల్లడించారు. తెలంగాణ పనుల పరోగతిపై కేంద్ర జల్శక్తి హర్షం వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని వెల్లడించింది. సమావేశంలో కరీంనగర్ ఈఎన్సీ శంకర్తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.