కరీంనగర్ : నీటి ఎద్దడి లేని రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇరిగేషన్ శాఖ అధికారులు, గుత్తేదారులతో జిల్లాస్థాయి ఇరిగేషన్ సలహా బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షతన వహించిన మంత్రి మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా రైతాంగానికి యాసంగిలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందించాలని సూచించారు.
కరీంనగర్ జిల్లాలోని 11 మండలాల్లో 1,31,768 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న కాకతీయ కాలువ ద్వారా సాగు నీటిని రెండు పంటలకు అందిస్తున్నారని తెలిపారు. నీటి విడుదల సమయంలోరైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిచేయాలన్నారు. పనులలో నిర్లక్ష్యంగా వ్యవహరించే గుత్తేదారులపై కఠనంగా వ్యవహరించాలని ఆదేశించారు.
కెనాల్ నిర్మాణ పనులలో ఎదురయ్యే భూసంబంధిత, ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న కెనాల్, ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోని, చెరువులు, కుంటలు నీటితో జలకళను సంతరించుకోవాలని తెలిపారు. జిల్లాలో 23 చెక్ డ్యాంల నిర్మాణాలను చేపట్టగా 90శాతం కంటే ఎక్కువ పనులను ఇప్పటికే పూర్తిచేసారని వెల్లడించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, మానకొండూర్, చొప్పదండి, హుస్నాబాద్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్, సంతోష్ కుమార్, అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్, శిక్షణ కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పో, ఇరిగేషన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.