హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య కొనసాగుతున్న వివాదంపై బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్-2 విచారణ పునఃప్రారంభమైంది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్ కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, జస్టిస్ తాళపత్ర ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో సాగిన ఈ విచారణలో తెలంగాణ తరఫు సాక్షి, సీడబ్ల్యూసీ విశ్రాంత సీఈ చేతన్ పండిట్ను ఏపీ సీనియర్ న్యాయవాది ఉమాపతి పలు అంశాలపై క్రాస్ ఎగ్జామిన్ చేశారు.
ప్రాజెక్టుల ఆపరేషన్ ప్రొటోకాల్, క్యారీ ఓవర్ స్టోరేజ్, నీటి వినియోగం తదితర అంశాలపై ఏపీ లేవనెత్తిన ప్రశ్నలకు చేతన్ పండిట్ దీటుగా బదులిచ్చారు. ఆపరేషన్ ప్రొటోకాల్ రూపకల్పనకు చేసిన సూచనల్లో ఏ అంశాలను పరిశీలించారని ఏపీ న్యాయవాది ప్రశ్నించగా.. తాగు, సాగునీటి అవసరాలకే తొలి ప్రాధాన్యమివ్వాలని, ఆ తర్వాతే విద్యుత్తు ఉత్పత్తికి నీటిని వినియోగించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో క్యారీ ఓవర్ స్టోరేజీ లెవల్ను మెయింటెయిన్ చేసేందుకు వీలుగా శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు జలాలను విడుదల చేసుకోవచ్చని తెలిపారు. ఈ విచారణకు ఇరు రాష్ట్రాల సీనియర్ ఇంజినీర్లు, సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. గురువారం కూడా విచారణ కొనసాగనున్నది.