Lok Sabha Elections | సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ను ప్రకటించారు. తెలంగాణలో మొత్తం 17లోకసభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి పోలింగ్ జరగనుంది. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో నిర్వహించ నుండగా తెలంగాణలో నాలుగో విడత పోలింగ్ జరగనుందని ఆయన వెల్లడించారు. నాలుగో విడుతలో మే 13న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఏప్రిల్ 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగనున్నది. 26న నామినేషన్ల పరిశీలన, 29 వరకు ఉపసంహరణకు గడువు ఇచ్చింది. 13న ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని ఈసీ వివరించింది.
లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు విడత జరుగనుండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో నాలుగో విడుతలో జరుగనున్నాయి. తొలి విడత ఏప్రిల్ 19న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగనున్నది. ఏప్రిల్ 26న రెండో విడత, మే 7న మూడో విడత, మే 13న నాలుగో విడుత పోలింగ్, 20న ఐదో విడత, 25న ఆరో విడత, జూన్ ఒకటిన ఏడో విడత పోలింగ్ జరుగుతుందని సీఈసీ తెలిపారు. లోక్సభతో పాటు దేశవ్యాప్తంగా 26 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి ఒక స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ వివరించింది.