రామాయంపేట / మనోహరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో అన్ని విధాలుగా ముందుకు వెళ్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి పారిశ్రామికవాడలో నెలకొల్పిన అక్షయ అగ్రి హార్వెస్టర్ల తయారీ పరిశ్రమను అటవీ శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి మంత్రి నిరంజన్ రెడ్డి శనివారం సందర్శించారు. అక్కడ తయారు చేసిన యంత్రాలను ఆయన పరిశీలించారు.
ఆ తర్వాత మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యధిక ఆధునిక విధానాలతో తెలంగాణ వ్యవసాయ రంగం ముందుకు వెళ్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ రైతులకు పెద్దపీట వేశారన్నారు. ప్రత్యేకమైన అధునిక పరికరాలతో రైతులకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో 90 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారన్నారని, 20 ఎకరాలు అంతకుమించి భూమి ఉన్న రైతులు కేవలం 22 వేల మంది మాత్రమేని మంత్రి తెలిపారు.
చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ రంగంలో తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో అత్యధిక దిగుబడి పొందాలంటే వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అవసరమని, అందుకోసం మెరుగైన యంత్రాలు కావాలని అన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయమే ఒక పరిశ్రమగా మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. వరికోత, ఇతర పరికరాలను అక్షయ అగ్రి వారు తయారు చేసిన విధానం బాగుందని కితాబిచ్చారు. అనంతరం మంత్రి అగ్రి పరిశ్రమ ఆవరణలో మొక్కలు నాటారు.