KRMB | హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): కృష్ణానదిపై ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా ఉన్నది. ప్రాజెక్టుల అప్పగింత అంశంపై జనవరి 17న కేంద్ర జల్శక్తిశాఖ సమావేశం నిర్వహించింది. ఆ సమావేశ మినిట్స్ను అదే నెల 19న విడుదల చేసింది. రెండింటిల్లోనూ ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు తెలంగాణ సర్కారు అంగీకరించిందని నొక్కిచెప్పింది. దీనిని ఖండిస్తూ హడావుడి చేసిన రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం వరకూ కేంద్రానికి జవాబివ్వలేదు. అంతా చేయిదాటిపోయాక జనవరి 27వ తేదీన కేంద్ర జల్శక్తిశాఖకు లేఖ రాసింది. దానిని కూడా వెంటనే పంపిందా అంటే అదీ లేదు. మరో 2 రోజుల కాలయాపన అనంతరం గత నెల 29న లేఖను పంపింది. తెలంగాణ డిమాండ్లను ముందుపెట్టింది. 17వ తేదీనాటి సమావేశంలో ప్రాజెక్టుల అప్పగింతకు ఒప్పుకోకపోయినా అంగీకరించినట్టు రికార్డు చేశారని, తెలంగాణ వాదనలను సమావేశంలో సరిగా రికార్డు చేయలేదని, వాటిని సవరించాలని కంటితుడుపుగా విజ్ఞప్తి చేసింది. దానికైనా కట్టుబడి ఉందా అంటే అదీ లేదు. ప్రభుత్వం తన వాదనలకు విరుద్ధంగా తాజాగా జరిగిన సమావేశంలో ఏకంగా ప్రాజెక్టులను బోర్డుకు అప్పగించేందుకు మరోసారి అంగీకారం తెలిపింది. సమావేశం అనంతరం కేంద్రానికి రాసిన లేఖను ప్రభుత్వం విడుదల చేయడం కొసమెరుపు.
కేంద్ర జల్శక్తిశాఖ, కృష్ణాబోర్డు సైతం ప్రాజెక్టుల అప్పగింతపై ఏకపక్షంగా ముందుకు పోతున్నాయి. సమావేశాలను నిర్వహించడం, ఆ తరువాత మినిట్స్ను రాష్ర్టాలకు పంపడం, అభిప్రాయాలను తీసుకొని నిజంగానే రికార్డు చేయని అంశాలు ఏమైనా ఉంటే తిరిగి మినిట్స్ను ఆ మేరకు సవరించడం పరిపాటి. కానీ తాజాగా కేంద్ర జల్శక్తిశాఖ అదేమీ చేయకుండానే నేరుగా మినిట్స్ను పంపడం, ఆ మినిట్స్పైనే తాజాగా కేఆర్ఎంబీ మరోసారి సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం.