హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ) : గాంధీభవన్ వద్ద గురువారం ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకున్నది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని గాంధీభవన్ ఎదుట తెలంగాణ ఉద్యమకారులు మెరుపు ధర్నా నిర్వ హించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి మహిళలు, వృద్ధులు, యువకులు, వికలాంగులు పెద్దసంఖ్యలో గాంధీభవన్కు చేరుకొని బైఠాయించారు. ఉద్యమకారులను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ఉద్యమకారులను యాచకులుగా మార్చిందని భిక్షాటన చేసి నిరసన వ్యక్తంచేశారు.
ఇప్పటికైనా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. అయితే మూడ్రోజులుగా కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్న క్రమంలో తెలంగాణ ఉద్యమకారులు ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో కాంగ్రెస్ నేతలు కంగుతిన్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఉద్యమకారులను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా, పోలీసులకు, ఉద్యమకారులకు మధ్య తోపులాట జరిగింది. అనంతరం భిక్షాటన చేస్తున్నవారిని అకడి నుంచి బలవంతంగా వాహనంలోకి ఎక్కించి పోలీస్స్టేషన్కు తరలించారు.