హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతాలు సృష్టిస్తున్నది. ఒకప్పుడు రోజుకు ఆరేడు వందల లారీల గొర్రెలను దిగుమతి చేసుకున్న తెలంగాణ.. ఇక ఎగుమతులు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ 2017లో ప్రారంభించిన ఈ పథకం గొల్ల, కురుమల కులవృత్తికి పూర్వ వైభవాన్ని తీసుకొని రావడమే కాకుండా వారిని ఆర్థికంగా నిలబెడుతున్నది. రాష్ర్టానికీ ఆర్థిక దన్నును అందిస్తున్నది. ఈ పథకం ద్వారా గత నాలుగేండ్లలో రూ.7,920 కోట్ల సంపదను సృష్టించినట్టు అధికారులు చెప్తున్నారు. రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి కూడా భారీగా పెరిగింది. తద్వారా ఇతర రాష్ర్టాల నుంచి మాంసం దిగుమతి తగ్గింది. దేశంలోనే అత్యధిక గొర్రెలు గల రాష్ట్రంగా తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. జాతీయ పశుగణన లెకల ప్రకారం తెలంగాణలో 190.63 లక్షల గొర్రెలు ఉన్నాయి.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి గొల్ల, కురుమ వ్యక్తికి ఒక్కో యూనిట్ (21) గొర్రెలను పంపిణీ చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. మొత్తం రూ.11 వేల కోట్లతో ప్రణాళిక రూపొందించింది. మొదటి విడతలో 3.94 లక్షల మందికి రూ.5,001.53 కోట్ల ఖర్చుతో 82.74 లక్షల గొర్రెలను పంపిణీ చేసింది. రెండో విడతలో రూ.6,125 కోట్ల ఖర్చుతో 3.50 లక్షల మందికి 73.50 లక్షల గొర్రెలను పంపిణీ చేయనున్నది. యూనిట్ గొర్రెల పంపిణీకి అయ్యే ఖర్చులో ప్రభుత్వం 75% సబ్సిడీ ఇస్తుండగా, లబ్ధిదారులు 25% చెల్లిస్తున్నారు. గతంలో యూనిట్ గొర్రెల కొనుగోలు ప్రభుత్వం కేటాయించిన మొత్తం రూ.1.25 లక్షలు కాగా, ప్రస్తుత గొర్రెల ధరలను పరిగణనలోనికి తీసుకొని యూనిట్ కాస్ట్ను రూ.1.75 లక్షలకు పెంచింది. ఈ విధంగా గొర్రెల కొనుగోలులో గొల్ల, కురుమలపై ఆర్థికభారం పడకుండా జాగ్రత్త తీసుకున్నది. ఒకవేళ ఈ పథకంలో పొందిన గొర్రెలు ప్రమాదవశాత్తు మరణిస్తే ఒకో గొర్రెకు రూ.5 వేలు, పొట్టేలుకు రూ.7 వేల చొప్పున బీమా పరిహారం పొందే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది.
గొర్రెలు, మేకల పంపిణీ పథకం ప్రవేశపెట్టిన తరువాత రాష్ట్రంలో గొర్రెల, మేకల ప్రాథమిక సహకార సంఘాల సంఖ్య రెట్టింపు అయ్యింది. సభ్యుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించడానికి ముందు రాష్ట్రంలో 3,969 సహకార సంఘాలు ఉండేవి. వీటిలో ఉన్న సభ్యుల సంఖ్య 2.24 లక్షల మంది. అప్పటి ప్రభుత్వాలు వీరి సంక్షేమంపై ఎలాంటి దృష్టి పెట్టలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అర్హులైన వారందరికీ సొసైటీల్లో సభ్యత్వం కల్పించి ప్రభుత్వ సాయం అందించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అన్ని గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. దీంతో సంఘాల సంఖ్య 8,109కి పెరిగింది. సభ్యుల సంఖ్య 7.61 లక్షలకు చేరింది. స్వరాష్ట్రంలో సహకార సంఘాల సంఖ్య 4,140, సభ్యుల సంఖ్య 5.37 లక్షలకు పెరగడం విశేషం.
రాష్ట్రంలో మాంసం ఉత్పత్తి భారీగా పెరిగింది. గత నాలుగేండ్లలో రాష్ట్రంలో 9.75 లక్షల టన్నుల మాంసం ఉత్పత్తి అయినట్టు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి.
ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెల ద్వారా సుమారు 1.32 కోట్ల గొర్రె పిల్లలు జన్మించినట్టు అంచనా. వీటిద్వారా 1.11 లక్షల టన్నుల అదనపు మాంసం ఉత్పత్తి అయిందని అధికారుల అంచనా.
కేంద్ర ప్రభుత్వ లెకల ప్రకారం రాష్ట్రంలో 2015-16లో గొర్రె మాంసం ఉత్పత్తి 1.35 లక్షల టన్నులు కాగా, 2020-21లో 3.03 లక్షల టన్నులకు చేరింది. అంటే 124% పెరుగుదల నమోదైంది.
రాష్ట్రంలో మాంసం వినియోగం భారీగా పెరిగింది. జాతీయ సగటు తలసరి వినియోగం 5.4 కేజీలు కాగా తెలంగాణలో ఇది 21.17 కేజీలు.
ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి అయ్యే గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గింది. పథకం ప్రారంభానికి ముందు ప్రతిరోజూ సుమారు 600-700 లారీల గొర్రెలు, మేకలు రాష్ర్టానికి దిగుమతి కాగా ఇప్పుడు వాటి సంఖ్య 80-100 లారీలకు తగ్గడం మాంసం ఉత్పత్తిలో తెలంగాణ సాధించిన స్వయం సమృద్ధికి నిదర్శనం.