హైదరాబాద్, ఫిబ్రవరి 8 : ఎలాంటి చర్చ జరుగకుండానే ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారని తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ మరోసారి అసహనం వ్యక్తంచేశారు. ఎలాంటి చర్చ జరుగకుండానే రాష్ట్రం ఏర్పడిందంటేనే ప్రధాని అవగాహన లేమి ఏమిటన్నది అర్థమవుతున్నది. అక్షరాలా అరవై ఆరేండ్ల సుదీర్ఘ చర్చల ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. 1956లో ఆంధ్రరాష్ట్రంలో విలీనం నాటినుంచే కుట్రలకు వ్యతిరేకంగా పోరాటం మొదలైంది. పెద్ద ఎత్తున వాదోపవాదాలు, చర్చోపచర్చలు, ఉద్యమాలు, ఆందోళనలు సాగాయి. వీటన్నింటినీ తిప్పికొట్టడానికి జై ఆంధ్ర లాంటి ఉద్యమాలు వచ్చినా తెలంగాణ ఆరని జ్వాలగా ప్రజ్వరిల్లుతూనే వచ్చింది. 2001లో కేసీఆర్ మలి దశ ఉద్యమంతో.. అప్పటిదాకా నివురుగప్పినట్టున్న ఆకాంక్ష ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఆ ఆకాంక్ష దేశవ్యాప్తంగా విస్తరించింది. దేశంలోని ప్రతి రాజకీయపార్టీ తెలంగాణ ఏర్పాటుపై లోతుగా చర్చించింది. అంతర్గతంగా, చట్టసభల్లోనూ చర్చలు జరిగాయి. కేంద్ర హోంశాఖ అన్ని పార్టీల ప్రతినిధులను ఢిల్లీకి ఆహ్వానించిన, వారి అభిప్రాయాలను స్వీకరించింది. వీటన్నింటి ఫలితంగానే.. తెలంగాణ సాకారమైంది.
విలీనాన్ని వ్యతిరేకించడంతో మొదలు..
1956లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయడాన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ తుంగలో తొక్కడం.. ఉద్యోగాల భర్తీలో అన్యాయంతో ఆగ్రహం పెల్లుబికింది. 1969లో తొలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. పోలీసు కాల్పుల్లో 369 మంది అమరులయ్యారు.
1972లో జై ఆంధ్ర ఉద్యమం ఎట్లా వచ్చిందో తెలియదా? హైదరాబాద్లో ముల్కీ నియమాల అమలు నేపథ్యంలో తెలంగాణకు వ్యతిరేకంగా పుట్టుకొచ్చింది కాదా? దీనిపై జరిగిన కుట్రలు.. తెలంగాణ నేతలకు పెట్టిన భ్రమలు.. ఆరు సూత్రాల పథకాలు, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610 జీవోలు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికి పన్నిన కుట్రల్లో భాగమే కదా.. 1997లో తెలంగాణ ఉద్యమకారులను అప్పటి సీఎం చంద్రబాబు నక్సలైట్లు అని ముద్రవేసినా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగడం వల్లనే కదా తెలంగాణ స్ఫూర్తి సజీవంగా ఉండగలిగింది!
2001లో కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటుచేసిన తర్వాత తెలంగాణ ఏర్పాటు చర్చ దేశవ్యాప్తమైంది. అనేక రూపాల్లో ఉద్యమాలు, రాజకీయ పార్టీలతో చర్చలు, మేధావులతో మథనం జరిగింది. 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు రోడ్మ్యాప్ ప్రకటించింది. ఆ తర్వాత ఆంధ్ర పాలకుల వెన్నుపోటుతో కేంద్రం వెనక్కు తగ్గడం వల్ల ఉద్యమం మరింత పెచ్చరిల్లింది. ఈ కారణంగా వందలాది యువత ఆత్మబలిదానానికి పాల్పడింది. దేశంలోని 35కు పైగా రాజకీయ పార్టీలు తెలంగాణ ఏర్పాటుకు మద్దతునిచ్చాయి.
ఆ అయిదు రోజులు ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై పార్లమెంటులో ఎలాంటి చర్చ జరుగలేదని ప్రధాని మోదీ అన్నారు. 2014 ఫిబ్రవరి 13న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును యూపీఏ సర్కారు లోక్సభలో ప్రవేశపెట్టింది. ఆ సందర్భంలోనే కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజ్గోపాల్ పెప్పర్ స్ప్రే వెదజల్లారు. ఆ తరువాత బిల్లుపై అయిదు రోజుల పాటు గందరగోళం మధ్యనే చర్చ కొనసాగింది. ఫిబ్రవరి 18న లోక్సభలో బిల్లును ఆమోదించారు. ఫిబ్రవరి 20న రాజ్యసభలో ఆమోదించారు. బీజేపీ పెద్దలైన సుష్మా, జైట్లీ, వెంకయ్య తదితరులంతా బిల్లుపై చర్చించినవారే. ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్యపై ఇంత సుదీర్ఘంగా చర్చ జరిగిన సందర్భం దేశంలో మరొకటి లేదు.