హైదరాబాద్: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను (Telangana decade celebrations) పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ 2కే రన్ను (Telangana 2k run) ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్తోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ఉత్సాహంగా రన్ కొనసాగింది. పోలీస్ వాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రన్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో అంబేద్కర్ విగ్రహం వద్ద మంత్రి మహమూద్ అలీ 2కే రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి, క్రీడాకారులు నిఖత్ జరీన్, ఈషా సింగ్, గాయకులు మంగ్లీ, రామ్ మిర్యాల, సినీ నటి శ్రీలీల పాల్గొన్నారు. నాలుగు వేలకుపైగా రన్నర్లు ఈ రన్లో పార్టిసిపేట్ చేశారు.
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రన్ను ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్తో కలిసి మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో మంత్రి మల్లా రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్ తెలంగాణ రన్ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ కలెక్టర్ అమయ్ కుమార్, రాచకొండ సీపీ చౌహాన్ పాల్గొన్నారు.
ఇక వనపర్తి జిల్లా కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ రన్ను మంత్రి నిరంజన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లాలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, జగిత్యాల జిల్లా ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్, నల్లగొండ పట్టణంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, నిర్మల్ జిల్లా కేంద్రంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డిలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఖిల్లాపై తిరంగా యాత్ర నిర్వహించారు. కోట వద్ద జాతీయ జెండా ఎగురవేశారు.