హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా 2,861 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 5,08,110 మంది రెగ్యులర్, 1,165 మంది ప్రైవేట్ కలిపి మొత్తం 5,09,275 విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. విద్యార్థులను గంట ముందే ఉదయం 8:30 గంటల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. గరిష్ఠంగా ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే వారిని మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తామని అధికారులు స్పష్టంచేశారు. ఐదు నిమిషాలు (9.35 గంటలు) దాటితే ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షకు అనుమతించబోమని చెప్పారు. ప్రశ్నపత్రాలను ఇప్పటికే పోలీస్స్టేషన్లలో డిపాజిట్ చేశారు. పరీక్ష కేంద్రంలోని ప్రవేశించిన విద్యార్థులు, ఇన్విజిలేటర్లు సహా ఇతర సిబ్బంది పరీక్ష పూర్తయ్యే వరకు కేంద్రాల్లో ఉండాల్సిందే. మధ్యలో బయటికి వెళ్లడం పూర్తిగా నిషేధం.
కాస్త భిన్నంగా ఇంగ్లిష్ ప్రశ్నపత్రం
ఎస్సెస్సీ పరీక్షల్లో అన్ని పేపర్లతో పొల్చితే ఇంగ్లిష్ కాస్త భిన్నంగా ఉంటుంది. మొత్తం 80 మార్కులకు పరీక్ష ఉండగా, ఇంగ్లిష్ పేపర్ పార్ట్-Aను 40 మార్కులు, పార్ట్- Bను 40 మార్కులకు నిర్వహిస్తారు. ఈ ఒక్కటి మినహా మిగతా అన్ని పేపర్లకు ప్రశ్నలు ఒకే విధంగా ఉంటాయి. ఇంగ్లిష్ పేపర్కు బుధవారం పరీక్ష ఉంటుంది. ఆ రోజు విద్యార్థులకు రెండు ప్రశ్నపత్రాలను ఒకేసారి ఇస్తామని, మిగతా సబ్జెక్టులకు మాత్రం బిట్ పేపర్ను చివరి అరగంటలో ఇస్తామని అధికారులు తెలిపారు.