ఖమ్మం వ్యవసాయం : ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో తేజా రకం మిర్చి పంటకు రికార్డు స్థాయి ధర పలికింది. బుధవారం ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా రూ.19,100 వెచ్చించి వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతో ఈ సీజన్లో మార్కెట్లో కొత్త రకం పంటకు అత్యధిక ధర పలకడం ఇదే తొలిసారి. ఒక రోజు వ్యవధిలో క్వింటాల్కు రూ. 600 పెరగడంతో పంటను మార్కెట్కు తీసుకొచ్చిన రైతుల సంతోషం వ్యక్తం చేశారు. పక్షం రోజుల క్రితం ఇదే మార్కెట్లో మిర్చి పంటకు గరిష్ఠంగా రూ.18వేలు పలికింది.
విదేశీ మార్కెట్లో తేజారకం పంటకు మంచి ఆదరణ ఉండడంతో ఖరీదుదారులు పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. యార్డుకు వచ్చిన పంట పూర్తిగా నాణ్యమైనది కావడంతో 70శాతం పంటను ఖరీదుదారులు నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో పంటకు మంచి ధర లభిస్తుండడంతో ఇదే అదనుగా భావిస్తున్న రైతులు పంటను భారీగా తరలిస్తున్నారు. ఉదయం జెండాపాట సమయానికి 51 వేల బస్తాలు మార్కెట్కు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అనంతరం జరిగిన కొనుగోళ్లలో గరిష్ఠ ధర రూ.19,110, మధ్య ధర రూ.18,500 చొప్పున వెచ్చించి ఖరీదుదారులు కొనుగోలు చేశారు. కనిష్ఠంగా రూ.14 వేలుగా, తాలు రకం ధర రూ.10,800 పలికిందని అధికారులు వివరించారు.