వేములవాడ, ఫిబ్రవరి 4: మున్నూరు కాపు సమాజం మొత్తం కలిసి రూ.50 కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వ ఖజానాకు అందజేస్తే ఆది శ్రీనివాస్ మంత్రి అవుతాడని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. ఆదివారం రాజ న్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నిర్వహించిన శ్రీ రాజరాజేశ్వరి మున్నూరు కాపు నిత్యాన్నదాన సత్రం 11వ వార్షికోత్సవ సభలో ఆయన మాట్లాడారు. అంతకుముందు ప్రభు త్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం మున్నూరు కాపు కార్పొరేషన్ త్వరలోనే ఏర్పాటు కాబోతుందని చెప్పారు. దీనిని ఉద్దేశిస్తూ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. కార్పొరేషన్ ఏర్పాటుతో పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అన్నారు. రూ.100 కోట్లు కేటాయిస్తే అది ఏ మూలకు సరిపోదని తెలిపారు. ఇంతటితో ఆగకుండా రాష్ట్రంలోని కాపులందరూ తలా వంద రూపాయలు వేసి రూ.50 కోట్లు సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వానికి చేయూతగా అందిస్తే ఆది శ్రీనివాస్ మంత్రి అవుతాడని చెప్పుకొచ్చారు. మాజీ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజా జీవితంలోకి రావాలనుకుంటున్నానని, ఖమ్మం లేదా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు.