Jagtial | మల్యాల : ప్రేమ వ్యవహారంలో యువతి కుటుంబం, యువకుడికి మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ క్రమంలో యువతి కుటుంబం చేతిలో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. యువకుడు కత్తితో దాడి చేయడంతో యువతి కుటుంబీకులు తీవ్ర గాయాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. మృతుడిని పెగడపల్లికి చెందిన భోగి మహేశ్గా గుర్తించారు.
వివరాల్లోకి వెళితే.. పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన భోగ మహేశ్ అనే యువకుడు మల్యాల మండలం తక్కల్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమ వేధింపుల పేరుతో వెంటపడుతున్నాడు. ఈ విషయమై సదరు యువతి మహేశ్ వేధింపులపై కుటుంబీకులకు తెలిపింది. దాంతో మల్యాల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు సైతం చేశారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో యువతిని దక్కించుకోవాలని ఉద్దేశంతో మహేశ్ పథకం ప్రకారం కత్తిని తెచ్చుకున్నాడు. యువతి ఇంటికి చేరుకోగా.. మహేశ్, యువతి కుటుంబీకులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది.
దాంతో మహేశ్ యువతి కుటుంబ తల్లి సత్తవ్వ, తాత నరసయ్యపై కత్తితో దాడి చేశారు. దాంతో ఇద్దరికి గాయాలయ్యాయి. వెంటనే తేరుకున్న కుటుంబీకులు ఆత్మరక్షణ కోసం నర్సయ్య బండరాయితో మహేశ్ తలపై కొట్టడంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మహేశ్ దాడిలో తీవ్ర గాయాలకు గురైన ఇద్దరిని 108లో జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. మల్యాల సీఐ దామోదర్రెడ్డి, ఎస్ఐ అబ్దుల్ రహీం సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉన్నది.