హైరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ)/బన్సీలాల్పేట్/మోస్రా (చందూర్) : గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్యకు కన్నీటి వీడ్కోలు పలికారు. ఆమె స్వగ్రామమైన నిజామాబాద్ జిల్లా మోస్రాలో ఆదివారం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్రెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, సీపీ సాయిచైతన్య తదితరులు హాజరై నివాళులర్పించారు. అంతకుముందు సికింద్రాబాద్లోని గాంధీ దవాఖానలోనూ సౌమ్య భౌతికకాయానికి మంత్రి జూపల్లి నివాళులర్పించారు. అనంతరం సౌమ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సౌమ్య కుటుంబానికి రూ.కోటి ఎక్స్గ్రేషియా ఇస్తామని, ఆమె తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని, సౌమ్య సర్వీస్ కాలం అంటే రిటైర్మెంట్ వయసు వరకు వేతనం చెల్లిస్తామని ప్రకటించారు.
విధి నిర్వహణలో ఆమె చూపిన తెగువ, నిబద్ధత స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు ఒక రోజు వేతనాన్ని సౌమ్య కుంటుంబ సభ్యులకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని, కుటుంబానికి అండగా నిలవడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది భద్రత ప్రభుత్వ కర్తవ్యమని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎక్సైజ్ అధికారులకు ఆయుధాలు ఇచ్చే నిర్ణయం ప్రభుత్వ పరిశీలనలో ఉన్నదని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. నివాళులర్పించిన వారిలో గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ వాణి, ఎక్సైజ్ శాఖ అదనపు కమిషనర్ యాసిన్ ఖురేషీ, జాయింట్ కమిషనర్ అంజన్రావు, గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్, కార్యదర్శి చంద్రశేఖర్, కానిస్టేబుళ్ల సంఘం అధ్యక్షుడు పీ రాజిరెడ్డి తదితరులు ఉన్నారు.
గంజాయి మూకలను అరికట్టడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య బలైందని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు, ఎక్సైజ్, పోలీస్ శాఖలంటే భయంలేకుండా గంజాయి, ఇతర స్మగ్లర్లు అడ్డొచ్చిన సిబ్బందిని చంపుకొంటూ వెళ్తున్నా.. ప్రభుత్వ పెద్దలు, అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. ఎప్పడు అడిగినా ‘ఎక్సైజ్ శాఖకు ఆయుధాలిచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నాం’ అనే సమాధానమే వినిపిస్తున్నది. అడపాదడపా దాడులు మినహా వ్యవస్థ మూలాల్లోకి వెళ్లడమే లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దలు స్పందించడం లేదనే చర్చ ఆ శాఖ సిబ్బందిలో మొదలైంది.