దిలావర్పూర్, జూన్ 13: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల బోధన చేస్తున్నారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నిర్మల్ జిల్లా నర్సాపూర్(జీ) మండలం రాంపూర్లో మంత్రి పర్యటించారు. మొదట స్థానిక రామాలయం వద్ద రూ.50 లక్షలతో నిర్మించనున్న కల్యాణ మండపం, రూ.12 లక్షలతో నిర్మించనున్న భీమన్న ఆలయానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలోని ఒడ్డెర సంఘ భవనం, ఎస్సీ సంఘ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మన ఊరు-మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో తొలి విడతలో 260 పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ప్రైవేట్కు దీటుగా సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి రూపాయి ఖర్చు లేకుండా ఆంగ్ల విద్యను అందిస్తామని స్పష్టంచేశారు. ఉపాధ్యాయులు అందుబాటులో ఉంటూ మెరుగైన విద్యనందించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.