హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం పర్వత్రెడ్డి, జీ సదానందం గౌడ్ కోరారు. గురువారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలకు విన్నవించారు. ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరారు. 317 జీవో ద్వారా స్థానికతను కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, ఉపాధ్యాయులకు వెంటనే ఉద్యోగోన్నతులు కల్పించి, బదిలీ ప్రక్రియ చేపట్టాలని కోరారు. పాఠశాలల్లో తొలిమెట్టు, ఉన్నతి వంటి కార్యక్రమాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉపాధ్యాయ బదిలీల్లో స్పౌజ్ పాయింట్లను రద్దు చేయాలని, నాన్ స్పౌజ్ టీచర్ల బదిలీలకు తొలి ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ నాన్ స్పౌజ్ టీచర్స్ అసోసియేషన్ (టీఎన్ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోకల శేఖర్, సక్కుబాయి కోరారు. గురువారం హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డికి టీఎన్ఎస్టీఏ నాయకులు శుభాకాంక్షలు తెలిపి, సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు కృష్ణకుమారి, రూపారాణి, ముఖ్య నాయకులు సిద్ధం శ్రీనివాస్, వెంకటయ్య, పద్మారెడ్డి, రవీందర్రెడ్డి, వెంకటరెడ్డి సావిత్రి ఉన్నారు.
తెలంగాణలోని తెలుగు, హిందీ, ఉర్దూ భాషా పండితులకు ఉద్యోగోన్నతులు కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు-తెలంగాణ రాష్ట్రం(ఆర్యూపీపీటీఎస్) రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు సీ జగదీశ్, ఎస్ నర్సింహులు కోరారు. ఈ విషయమై గురువారం సీఎం రేవంత్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నూతన తెలంగాణ భాషా విధానాన్ని ప్రవేశపెట్టాలని, పాఠశాలల్లో వారానికి 6 హిందీ క్లాసులు నిర్వహించాలని, పాఠశాల విద్యలో నాలుగో తరగతి నుంచే హిందీని ప్రవేశపెట్టాలని కోరారు. రాష్ట్రంలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని గ్రేడ్-2 భాషా పండిత వ్యవస్థను రద్దుచేసి అందరినీ స్కూల్ అసిస్టెంట్ స్థాయికి అప్గ్రేడ్ చేయాలని విన్నవించారు.