నెన్నెల, జూలై 4 : పాఠశాల విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకూ బ్రేక్ఫాస్ట్తోపాటు మధ్యాహ్న భోజనం అందించాల న్న ప్రభుత్వం నిర్ణయంపై ఉపాధ్యాయులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. శనివారం మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం గంగారం ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు శ్రీనివాస్ మధ్యాహ్న భోజన నిర్వాహకులకు 60 కోడి గుడ్లు అందజేసి నిరసన తెలిపారు. ఉపాధ్యాయులకు పెం డింగ్ డీఏలు, పీఆర్సీలు ఇవ్వకుండా.. టీచర్లకు బ్రేక్ఫాస్ట్, భోజనం అంటూ నిర్ణయాలు తీసుకోవడం సరైందికాదని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఇప్పటికే ఆరు డీఏలు పెండింగ్లో ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని స్పష్టంచేశారు.
సీపీఎస్ రద్దు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి, ఇప్పుడు దాని ఊసెత్తడం లేదని విమర్శించారు. కుకింగ్ కాస్ట్ చాలా తక్కువగా ఉన్నదని, ప్రతి విద్యార్థికి కనీసం రూ.15 నుంచి రూ.18 వరకు ఇస్తే బాగుంటుందని సూచించారు. ఉపాధ్యాయులకు బ్రేక్పాస్ట్, మధ్యాహ్న భోజనం అంటూ ప్రభుత్వ వింత వాదనకు నిరసన గా కార్మికులకు గుడ్లు ఇచ్చి నిరసన తెలిపినట్టు శ్రీనివాస్ చెప్పారు. తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామంటూ టీపీయూఎస్ ఆధ్యర్యంలో నెన్నెల తహసీల్దార్ శ్రీనివాస్కు వినతిపత్రం అందజేసినట్టు సంఘం జిల్లా కార్యదర్శి నాగేందర్, చంద్రశేఖర్ తెలిపారు.