హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): సర్కార్ బడుల రేషనలైజేషన్ చేయాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా గతంలో జారీచేసిన జీవో-25ను మెజారిటీ ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ జీవోను ప్రామాణికంగా తీసుకుంటే తాము అస్సలు అంగీకరించబోమంటున్నాయి. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తిని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. వచ్చే విద్యాసంవత్సరంలో రేషనలైజేషన్ చేపట్టేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తున్నది. పదేండ్ల క్రితం జారీచేసిన జీవో-25 ప్రకారం రేషనలైజేషన్ కుదరదని, సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. ఈ జీవోను వ్యతిరేకిస్తూ సోమవారం పలు టీచర్ సంఘాలు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరై, నిరసన వ్యక్తంచేశాయి. రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.
1 : 20కి తగ్గించాలి
ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేసేందుకు జీవో -25ను సవరించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 52 మంది విద్యార్థులున్న హైస్కూల్కు 9 మంది టీచర్స్ను ఇచ్చి, 60 మంది విద్యార్థులుండే ప్రాథమిక పాఠశాలకు తరగతికి ఒక టీచర్ను ఎందుకు కేటాయించారని నిలదీస్తున్నాయి. రేషనలైజేషన్ అనేది అన్ని స్కూళ్లకు ఒకే రకంగా ఉండాలి.. కానీ ప్రైమరీకో న్యాయం.. హైస్కూల్కో న్యాయం ఎలా అవుతుందని ప్రాథమిక పాఠశాల టీచర్లు ప్రశ్నిస్తున్నారు. కొన్ని ఉపాధ్యాయ సంఘాలైతే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని 1:30 నుంచి 1:20కి తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. 20 మంది విద్యార్థులకు ఇద్దరు సెకండరీ గ్రేడ్ టీచర్లు, 21-40 మంది వరకు ముగ్గురు, 41-60 వరకు తరగతికి ఒక టీచర్, 60 మంది విద్యార్థులు దాటితే తరగతికి ఒక టీచర్తోపాటు పీఎస్ హెచ్ఎం, 80మంది విద్యార్థులు దాటితే అదనంగా ఒక పీఈటీ పోస్టును కేటాయించాలంటూ కొత్త డిమాండ్లు వినిపిస్తున్నారు. టీచర్లు సెలవులపై వెళ్లినప్పుడు సర్దుబాటు చేసేందుకు మండలానికి ఐదుగురు టీచర్లను అందుబాటులో ఉంచాలని సెకండరీ గ్రేడ్ టీచర్ల సంఘాలు కోరుతున్నాయి.
పోస్టుల రద్దు తగదు..
సెకండరీ గ్రేడ్ టీచర్/ఎస్జీటీ పోస్టులను రద్దుచేసే ప్రతిపాదనలను ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇటీవలే 2,325 ఎస్జీటీ పోస్టులను రద్దుచేసి, 2,064 కొత్త పోస్టులను క్రియేట్ చేసే ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ సర్కార్కు పంపించింది. ఎస్జీటీ పోస్టులను రద్దుచేసి, 261 హెచ్ఎం, 1,803 పీఈటీ పోస్టులను క్రియేట్ చేయాలంటూ ప్రతిపాదనలు పంపించింది. ఇలా పోస్టులను రద్దుచేయడం అన్యాయమని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కరివేద మహిపాల్రెడ్డి అభిప్రాయపడ్డారు. పోస్టులను తగ్గించడమంటే ప్రాథమిక పాఠశాలలను నిర్వీర్యం చేయడమే అవుతుందని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు అనిల్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వారు కోరారు.