Nalgonda | నిడమనూరు, నవంబర్ 30 : ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు ఆదర్శ పాఠశాలలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఉపాధ్యాయుడి వ్యవహార శైలితో విసిగిపోయిన విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలుపడంతో శనివారం వారు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. సాంఘికశాస్త్రం బోధించే ఉపాధ్యాయుడు దొడ్డా ఆంజనేయులు రెండు నెలల క్రితం బదిలీల్లో భాగంగా నిడమనూరు ఆదర్శ పాఠశాలకు వచ్చాడు. 6,7,8వ తరగతుల విద్యార్థులకు బోధిస్తున్నాడు. సబ్జెక్టుకు సంబంధం లేని అశ్లీల మాటలతో అనుచితంగా ప్రవర్తించడం విద్యార్థినులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది.
అక్కడక్కడ చేతులు వేస్తూ పుట్టుమచ్చలు చూపించాలనడంతో వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఉపాధ్యాయుడి తీరుపై పలువురు విద్యార్ధినులు ప్రిన్సిపాల్ నిర్మలకు రెండు రోజుల క్రితమే ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులకు కూడా చెప్పడంతో వారు శనివారం ఎస్ఎఫ్ఐ నేతల ఆధ్వర్యంలో పాఠశాలకు వచ్చి ఆందోళనకు దిగారు. ప్రిన్సిపాల్ నిర్మల వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్రెడ్డి మధ్యాహ్నం పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులతో మా ట్లాడి ఉపాధ్యాయుడి అసభ్య ప్రవర్తనపై అసహనం వ్యక్తంచేశారు. ఘటనపై విచారణ జరపాలని కలెక్టర్తోపాటు మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజును ఆదేశించారు.
అసభ్య ప్రవర్తన అవాస్తవం: ఉపాధ్యాయుడు
తాను విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని ఉపాధ్యాయుడు దొడ్డా ఆంజనేయులు తెలిపారు. చనువుగా ఉండటం వల్ల విద్యార్థినులు అపార్థం చేసుకున్నారని, సబ్జెక్టు కాని విషయాలను విద్యార్థినులతో చర్చించలేదని తెలిపారు.