Kodangal | రాష్ట్రస్థాయి టీచర్స్ డే వేడుకల వేదిక అనూహ్యంగా మారిపోయింది. హైదరాబాద్లో నిర్వహించాల్సిన రాష్ట్రస్థాయి గురుపూజోత్సవాన్ని రేవంత్ సర్కార్ కొడంగల్కు తరలించింది. తొలుత హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్లోని ఆధునికీకరించిన బాలభవన్లో వేడుకలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.70 లక్షల వ్యయంతో బాలభవన్ ఆధునికీకరణ పనులను సైతం పూర్తి చేసింది. అయితే కార్యక్రమానికి కొద్దిరోజుల ముందు వేదికను అనూహ్యంగా కొడంగల్కు మార్చడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రస్థాయి టీచర్స్ డే వేడుకలను హైదరాబాద్కు వెలుపల నిర్వహించడం ఇదే తొలిసారిగా భావిస్తున్నారు. ఈసారి కొడంగల్లో రాష్ట్రస్థాయి గురుపూజోత్సవాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరై 123 మంది ఉత్తమ ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులకు పురస్కారాలు అందజేయనున్నారు. అయితే అవార్డులకు ఎంపికైన వారంతా నేరుగా కొడంగల్లోని కార్యక్రమ వేదిక వద్దకు రావాలని అధికారులు ఆదేశించారు.
తొలుత హైదరాబాద్లోనే రాష్ట్రస్థాయి కార్యక్రమం జరుగుతుందని అధికారులు, ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతలు భావించారు. దీనికి అనుగుణంగానే పలువురు తమ ప్రయాణ, ఇతర ఏర్పాట్లను చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే చివరి నిమిషంలో వేదికను కొడంగల్కు మార్చడంతో అవార్డులకు ఎంపికైన వారిలో అయోమయం నెలకొంది.
హైదరాబాద్లోనే కార్యక్రమం ఉంటుందని భావించిన వారికి అకస్మాత్తుగా కొడంగల్కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఎంపికైన అవార్డు గ్రహీతలు కొడంగల్ చేరుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాష్ట్రస్థాయి వేడుకల వేదిక మార్పుపై చివరి వరకు స్పష్టత లేకపోవడంతో ఉపాధ్యాయులు, అవార్డు గ్రహీతల్లో ఉత్కంఠ నెలకొంది. కొడంగల్లో రాష్ట్రస్థాయి కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు కార్యక్రమానికి ఒక్కరోజు ముందు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను హడావుడిగా చేపట్టినట్లు సమాచారం. చివరి నిమిషంలో మారిన వేదిక కారణంగా ఏర్పాట్లపై కూడా ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు అవార్డు గ్రహీతలు సైతం కొడంగల్కు చేరుకోవాల్సి రావడంతో వారి ప్రయాణ ఏర్పాట్లు, సమయపాలనపై ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రాష్ట్రస్థాయి టీచర్స్ డే వేడుకలను హైదరాబాద్ నుంచి కొడంగల్కు ఎందుకు మార్చారనే అంశంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రూ.70 లక్షలతో ఆధునికీకరించిన బాలభవన్లోనే కార్యక్రమాన్ని నిర్వహించకుండా చివరి నిమిషంలో వేదిక మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వేదిక మార్పుపై ముందుగానే స్పష్టత ఇస్తే అవార్డు గ్రహీతలు, ఇతర ఉపాధ్యాయులు తమ ప్రయాణ ఏర్పాట్లను సులభంగా చేసుకునేవారని పలువురు అభిప్రాయపడుతున్నారు.