హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : విద్యార్థులు తమ ఆశయాలను సాధించేంతవరకు ఉపాధ్యాయులు స్ఫూర్తిదాయకంగా ఉండాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. విద్యార్థుల్లో అంతర్లీనంగా ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులను మంత్రి అభినందించారు. సోమవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్హెచ్చార్డీలో ఉత్తమ ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించిన మంత్రి వారికి ముందుగా గురుపూజోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా వారి అనుభవాలను అడిగి తెలుసుకొన్నారు. దేశ భవిష్యత్తు ఉపాధ్యాయుల చేతుల్లోనే సురక్షితంగా ఉంటుందని మంత్రి చెప్పారు. ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రముఖంగా ఉం టుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు జన్మనిస్తే .. చిన్నారులకు మంచి భవిష్యత్తునిచ్చేది గురువులని మంత్రి ఈ సందర్భంగా పేరొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్యా రంగానికి పెద్దపీట వేస్తున్నారని కొనియాడారు.కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి, వైస్ చైర్మన్లు వెంకటరమణ, ఎస్కే మహమూద్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీ దేవసేన తదితరులు పాల్గొన్నారు.
నేడు సన్మానం
గురుపూజోత్సవం సందర్భంగా 125 మంది టీచర్లకు, అధ్యాపకులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అవార్డులను అందజేయనున్నది. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పాఠశాల విద్య తరఫున 54, ఇంటర్ నుంచి విద్య 11, సాంకేతిక విద్యలో నలుగురు, ఉన్నత విద్య నుంచి 56 మంది టీచర్లు ఈ అవార్డులను స్వీకరిస్తారు.
ఢిల్లీలో ఇద్దరికి..
రాష్ర్టానికి చెందిన టీచర్లు అర్చన, బీ సంతోష్కుమార్లు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికయ్యారు. వీరు మంగళవారం ఢిల్లీలో రాష్ట్రపతి నుంచి అవార్డులను అందుకొంటారు.