టెట్ ఫలితాల విడుదలతో మార్గం సుగమం
పాఠశాల విద్యాశాఖలో 9,096 పోస్టులు
పోస్టుల భర్తీకి ఇప్పటికే ఆర్థికశాఖ ఆమోదం
ఇక నోటిఫికేషన్లు జారీచేయడమే మిగిలింది
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో త్వరలోనే టీచర్ కొలువుల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానున్నది. పాఠశాల విద్యాశాఖతోపాటు గురుకులాలు, మాడల్ స్కూళ్లల్లో టీచర్ పోస్టుల భర్తీకి ముందడుగు పడనున్నది. ఇప్పటికే 9,096 టీచర్ పోస్టుల భర్తీకి జూన్ 17న ఆర్థికశాఖ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. వీటిని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఆర్ఈఐఆర్బీ) ద్వారా భర్తీచేసేందుకు ఆమోదముద్ర వేసింది.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు శుక్రవారం వెల్లడికావడంతో ఇక నోటిఫికేషన్లు ఇవ్వడమే మిగిలింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టెట్ అర్హత తప్పనిసరి. తెలంగాణ వచ్చాక 2016 మేలో, 2017 జూలైలో టెట్ నిర్వహించారు. గతంలో టెట్ వ్యాలిడిటీ ఏడేండ్లు ఉండగా, ఇటీవలే దానిని జీవితకాలం పొడిగిస్తూ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) ఉత్తర్వులు జారీచేసింది. దీంతో క్వాలిఫై అయి న వారికి సమస్యలేకపోగా, 2017 అంతకు ముందు క్వాలిఫై కానివారితోపాటు ఇటీవల ఉపాధ్యాయ విద్య కోర్సులను పూర్తిచేసిన వారి కోసం జూన్ 12న టెట్ నిర్వహించారు. ఫలితాలను శుక్రవారం ప్రకటించారు.