హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి సైకిల్ గుర్తు మనకు కనిపించదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే టీడీపీ (TDP) చేతులెత్తేసింది. అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేయకూడదని ఆ పార్టీ నిర్ణయించింది. పేరుకే పోటీ చేయడం కంటే దూరంగా ఉండడమే ఉత్తమమని టీడీపీ భావిచింది. ఈమేరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్కు పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu) సూచించినట్లు సమాచారం.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టయి, రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబాబును కాసాని జ్ఞానేశ్వర్ శనివారం కలిశారు. ఈ సందర్భంగా దీనిపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్టు కాసాని కోరగా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణపై దృష్టిసారించలేదని చంద్రబాబు చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో పోరాడి విజయం సాధిస్తే తెలంగాణలో కూడా పార్టీ సులభంగా బలపడుతుందని సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకుంటే బాధపడాల్సి ఉంటుందని, ఇప్పటికైతే పోటీ కష్టమని అనిపిస్తోందని కాసాని జ్ఞానేశ్వర్కు చెప్పినట్లు తెలిసింది. బరిలో దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలని, ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూస్తున్నారు కదా అని సర్దిచెప్పినట్టు సమాచారం.