హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ఆటోడ్రైవర్లవి ఆత్మహత్యలు కావని, అవి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలు అని టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయి బతకడమే కష్టంగా మారటంతో ఆటోడ్రైవర్లకు చావే దిక్కు అవుతున్నదని వాపోయారు. ఇంతమంది డ్రైవర్లు చనిపోతున్నా సీఎం రేవంత్రెడ్డికి ఉలుకూపలుకూ లేదని ధ్వజమెత్తారు. గురువారం నాచారంలో వేముల మారయ్య మీడియాతో మాట్లాడుతూ.. నిజామాబాద్కు చెందిన ఆటోడ్రైవర్ స్వామి దంపతుల మరణానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఉచిత బస్సు పథకాన్ని తాము వ్యతిరేకించటం లేదని, ఉపాధిని దెబ్బతీయకుండా భరోసా కల్పించాలని కోరుతున్నామని తెలిపారు. ఆటోడ్రైవర్లకు ఎలాంటి సాయం అందిస్తామన్నది ప్రభుత్వం స్పష్టత ఇవ్వటం లేదని మండిపడ్డారు. తమను పట్టించుకోకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో ఆటోడ్రైవర్ల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్కు ఆటోడ్రైవర్ల సమస్యలపై రిపోర్ట్ కూడా అందించామని, ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పందన లేదని విమర్శించారు. తక్షణమే ఆటోడ్రైవర్లకు న్యాయం చేసే కార్యాచరణ చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో షాతం రమేశ్, సాయికుమార్, రాజు తదితరులు పాల్గొన్నారు.