CM Revanth Reddy | ప్రపంచంతో పోటీపడేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణ యువతకు అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. రాష్ట్రంలో యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో శిక్షణ నివ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి దేశంలోని ప్రముఖ సంస్థ టాటా టెక్నాలజీస్ లిమిటెడ్ ప్రతినిధులతో సీఎం శనివారం సమావేశమయ్యారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఐటీఐల్లో ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆధునిక కోర్సులను ప్రవేశపెట్టాలని సూచించారు. తెలంగాణలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించడానికి రాష్ట్ర పభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. దీనికి అనుగుణంగా సాంకేతిక కోర్సులను పూర్తిచేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి, సొంతంగా పరిశ్రమలను ఏర్పాటుచేసుకుని పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి అవసరమైన కోర్సులను ప్రవేశపెట్టాలని సమావేశంలో పాల్గొన్న టాటా సంస్థ ప్రతినిధులకు, అధికారులకు సీఎం రేవంత్ సూచించారు.
కాలం చెల్లిన కోర్సులతో యువత సమయాన్ని, విద్యను వృథా చేయకుండా ఆధునాతన కోర్సుల్లో శిక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నిరకాలుగా సహకరిస్తుందన్నారు. రాష్ట్రంలోని 50 ప్రభుత్వ ఐటీఐల్లో రూ.1500 నుంచి రూ.2వేల కోట్లతో ఉపాధి ఆధారిత పారిశ్రామిక శిక్షణ అందించడానికి టాటా టెక్నాలజీస్ ముందుకు రావడాన్ని సీఎం స్వాగతించారు. రాష్ట్రంలో 4.0 స్కిల్లింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతోపాటు వాటి నిర్వహణకు కావాల్సిన మెషినరీ, పరికరాలను, సాఫ్ట్వేర్ను టాటా సంస్థ అందివ్వనున్నది. రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష మంది విద్యార్థులు శిక్షణ పొంది పలు పరిశ్రమలో ఉద్యోగాలు పొందే విధంగా తగు శిక్షణ అందించడానికి టాటా సంస్థ ముందుకు రావడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. టాటా సంస్థతో తమ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని.. ఇందుకు కావాల్సిన ఏర్పాట్లను చేయాలని అధికారులను ఆదేశించారు. ఎంఓయూను కుదుర్చుకునేందుకు ఉన్నతాధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎస్ను ఆదేశించారు.
యువతకు ఇండస్ట్రియల్ ఆటోమేషన్, రోబోటిక్స్ తయారీ, అధునాతన సీఎన్సీ మెషినింగ్ టెక్నీషియన్, ఈవీ మెకానిక్, బేసిక్ డిజైనర్, వర్చువల్ వెరిఫైయర్ లాంటి 4.0 పరిశ్రమ ఆధారిత కోర్సుల్లో తగు నైపుణ్యాన్ని ప్రభుత్వ ఐటీఐల్లో టాటా అందివ్వనున్నది. 4.0 పరిశ్రమ కోర్సుల నిర్వహణకు అవసరమైన యంత్రాలు, సాఫ్ట్వేర్ను అందించడంతో పాటు ప్రతీ ఐటీఐలో ఇద్దరు మాస్టర్ ట్రెయినర్లను టాటా సంస్థ అందిస్తుంది. ఈ ప్రాజెక్టును ఐదేళ్ల పాటు టాటా సంస్థ ఉచితంగా అందిస్తుంది. ఇందులో భాగంగా ఆధునిక సాంకేతిక వర్క్ షాపులు, అత్యధిక డిమాండ్ కలిగిన తయారీ రంగంలో ఉపాధి కల్పించడానికి 22 నూతన స్వల్పకాలిక, ఐదు దీర్ఘకాలిక కోర్సులను పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ప్రాజెక్టులో టాటా సంస్థ అందిస్తుంది.
ఇప్పటికే ఎంఓయూ విధివిధానాలు ఖరారు చేసేందుకు రాష్ట్ర ఉపాధికల్పన, కార్మికశాఖ టాటా టెక్నాలజీతో సంప్రదింపులు జరుపుతున్నది. దీని ఆధారంగానే రాష్ట్రంలో 50 ప్రభుత్వ ఐటీఐలను గుర్తించడం జరిగిందని అధికారులు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కార్మిక, ఉపాధికల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాణి కుముదిని, ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం, టాటా టెక్నాలజీస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ పీవీ కౌల్గుడ్, గ్లోబల్ హెడ్ వైస్ ప్రెసిడెంట్ సుశీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.