హైదరాబాద్, నవంబర్ 10 (నమస్తే తెలంగాణ): గోదావరి జలాల్లో తెలంగాణకు ఉన్న 968 టీఎంసీల వాటాకు రక్షణ కల్పించాకే నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ముందుకుసాగాలని తెలంగాణ సర్కారు తేల్చిచెప్పింది. తెలంగాణ సమర్పించిన అన్ని డీపీఆర్లకు వెంటనే ఆమోదం తెలపాలని పట్టుబట్టింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానం ప్రాజెక్టుపై 5వ కన్సల్టెన్సీ సమావేశం శుక్రవారం జలసౌధలో కొనసాగింది. ఎన్డీడబ్ల్యూడీఏ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో లింక్ ప్రాజెక్ట్ అమలుకు రూపొందించిన ముసాయిదా ఎంవోఏపై రాష్ర్టాలతో చర్చించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కారు వాదన వినిపిస్తూ.. రాష్ట్ర వాటాకు రక్షణ కల్పించడంతోపాటు అన్ని అవసరాలను నెరవేర్చాకే గోదావరి జలాల మళ్లింపునకు అంగీకరిస్తామని తేల్చిచెప్పింది.
నదుల అనుసంధాన ప్రాజెక్టుపై ఎన్డబ్ల్యూడీఏ చేప ట్టే అధ్యయనంలో తెలంగాణకు భాగస్వా మ్యం కల్పించాలని స్పష్టం చేసింది. గోదావరి నుంచి కావేరికి మళ్లించనున్న 166 టీఎంసీల నీటిలో తెలంగాణకు 45 టీఎంసీలను మాత్ర మే కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గోదావరి నుంచి కృష్ణా బేసిన్కు నీటి మళ్లింపు వ్యవహారం ట్రిబ్యునల్-1 నిబంధనలకు లోబడి ఉంటుందని గుర్తుచేసింది. కృష్ణా బేసిన్లో ముఖ్యంగా తెలంగాణ పరిధిలో సాగు, తాగునీటి వసతులను కల్పించాల్సిన కరువు పీడిత, వెనుకబడిన ప్రాంతాలు చాలా ఉన్నాయని, 50 శాతం వాటా ఇవ్వాల్సిందేనని పట్టుబట్టింది. అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నందున ఎంవోఏపై చర్చించడం సముచితం కాదని, ఆ సమస్యలన్నీ తేలేవరకూ నదుల అనుసంధానానికి అంగీకరించబోమని తెలంగాణ తేల్చిచెప్పింది.
నిరుపయోగ జలాలనే మళ్లిస్తాం: శ్రీరామ్
ఇంటర్ రివర్ లింకింగ్ టాస్క్ఫోర్స్ కమిటీ చైర్మన్ వెదిరె శ్రీరామ్ మాట్లాడుతూ.. గోదావరిలో నిరుపయోగ జలాలను మాత్రమే కావేరికి మళ్లిస్తామని తెలిపారు. ఈ విషయంలో రాష్ర్టాలు ఎలాంటి అపోహాలకు పోవద్దని, జల వాటాలకూ ఇబ్బంది ఉండబోదని చెప్పారు.