హుజూరాబాద్ టౌన్, జనవరి 21: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శివారులోని ఓ రైస్మిల్లులో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్ఫోర్స్, పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఆదివారం హుజూరాబాద్ ఏసీపీ జీవన్రెడ్డి వెల్లడించిన వివరాల మేరకు.. హుజూరాబాద్ శివారులోని శ్రీనివాస్ రైస్మిల్లులో శనివారం అర్ధరాత్రి పెద్దమొత్తంలో రేషన్ బియ్యాన్ని డంపు చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. టాటా మ్యాజిక్ బండిలో కొన్ని, రైస్మిల్లులో నిల్వ చేసినవి కొన్ని కలిపి మొత్తం 961 బస్తాలను గుర్తించారు. వీటిని తూకం వేసి 255 క్వింటాళ్ల బియ్యంగా నిర్ధారించారు. సీజ్ చేసి రెవెన్యూ అధికారులకు అప్పగించారు.
మిల్లు యజమాని శ్రీనివాస్ ప్రభుత్వానికి సీఎంఆర్ ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. దీనిని పూడ్చుకునేందుకు రేషన్ బియ్యం దందాకు తెరలేపాడు. బోర్నపల్లికి చెందిన పిల్లి శ్రీధర్, వీణవంకకు చెందిన సురేశ్, మెట్పల్లికి చెందిన రమేశ్కు బియ్యం తీసుకువచ్చే బాధ్యతను అప్పగించాడని ఏసీపీ తెలిపారు.మిల్లు యజమాని ఎస్ శ్రీనివాస్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా, ఇతడికి సహకరించిన సదరు ముగ్గురు పరారీలో ఉన్నట్టు పేర్కొన్నారు.