కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ)/కౌటాల: మిర్చి సాగుతో సిరులు పండిస్తున్నారు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తాటిపల్లి రైతులు. నాడు ఎవుసంలో నష్టపోయి.. వలసపోయిన రైతు లు.. నేడు లాభాలు ఆర్జిస్తున్నారు. ప్రభు త్వం అందిస్తున్న నిరంతర విద్యుత్తుకు తోడు స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాటిపల్లిలో సుమారు 600 కుటుంబాలు ఉ న్నాయి. ఇక్కడ దాదాపు అందరూ వ్యవసాయదారులే. వర్షాధారంపైనే పంటలు సాగు చేస్తుంటారు.
ఊరి పక్కనే వార్ధా నది ప్రవహిస్తున్నా పంటలకు నీరందే అవకాశం లేక భూములన్నీ బీళ్లుగా దర్శనమిస్తాయి. వర్షాధార పంటలు వేసినా సరైన దిగుబడి రాక ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. కానీ.. ఇదంతా గతం.. ఇప్పుడు ఆ భూముల్లో మిర్చి సాగుతో సిరులు పండిస్తున్నారు. ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుండగా, స్థానిక ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 220 విద్యుత్తు మోటర్లు అందించి.. వార్ధా నది నుంచి పంట పొలాలకు నీరు మళ్లించేలా చర్యలు చేపట్టారు. మొదట జొన్న, మక్క, కూరగాయలు సాగుచేసిన ఆ రైతులు.. నేడు మిర్చి పండిస్తున్నారు. గుంటూరు నుంచి మేలైన మిర్చి విత్తనాలను తీసుకువచ్చి సాగుచేస్తున్నారు.
ఎకరాకు 30 క్వింటాళ్లకుపైనే..
మిర్చి సాగులో ఎకరానికి 30 నుంచి 35 క్వింటాళ్ల దాకా దిగుబడి సాధిస్తున్నారు తాటిపల్లి రైతులు. మహారాష్ట్రలోని నాగ్పూర్ మా ర్కెట్కు తరలించి అమ్ముకుంటున్నారు. అక్క డ క్వింటాల్కు రూ. 20 వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలుకుతున్నది. క్వింటాల్కు రూ. 20 వేల చొప్పున లెక్క వేసుకున్నా.. 30 క్వింటాళ్లకు రూ.6 లక్షల ఆదాయం వస్తున్నది. రూ.లక్ష నుంచి రూ.1.30 లక్షల వరకు పెట్టుబడి పోయినా.. మిగతా డబ్బులు మిగులుతాయని రైతులు చెప్తున్నారు.
52 క్వింటాళ్లు పండించిన
ఎకరం పది గుంటల్లో మిర్చి సాగు చేసిన. పెట్టుబడి రూ.1.60 లక్షల దాకా పెట్టిన. 52 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి వచ్చింది. నాగ్పూర్ తీసుకువెళ్లి అమ్మిన. క్వింటాల్కు రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు ధర పలికింది. ఖర్చులన్నీ పోను రూ. 10 లక్షలకు పైనే ఆదాయం వచ్చింది. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్తును వినియోగించుకొని మోటర్లతో సాగునీరు పెడుతున్నం మిర్చి సాగుతో మంచి లాభాన్ని పొందుతున్న.
– తాంగ్డే మోతీరాం, రైతు (తాటిపల్లి)
మా ఊరి జాతకమే మారిపోయింది
మిర్చిసాగుతో మా ఊరి జాతకమే మారిపోయింది. గతంలో సాగునీరు లేకుండే. ఒక్క వానకాలంలోనే పంటలేసేటోళ్లం. ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఈ ప్రాంత రైతులకు 220 విద్యుత్తు మోటర్లు అందించారు. ఉచిత విద్యుత్తును వాడుకుంటున్నం. వార్ధా నది నుంచి పంటలకు నీళ్లు పెట్టుకుంటున్నం. నాకున్న 6 ఎకరాల్లో మిర్చి సాగు చేయగా 190 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇదివరకు వ్యవసాయం చేసి అప్పుల పాలైనం. ఇప్పుడు లాభాల బాట పట్టినం.
– బడిగే దామాజీ, రైతు (తాటిపల్లి)