నిడమనూరు, అక్టోబర్ 10 : ప్రధాని మోదీని గద్దె దింపడమే లక్ష్యంతో 28 పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి అంటేనే ప్రధానికి భయం పట్టుకుందని, అందుకే ఇండియా పేరును భారత్గా మార్చాలని ప్రయత్నిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమితోనే సీపీఎం దేశవ్యాప్తంగా జత కడుతుందని తెలిపారు. నల్లగొండ జిల్లా నిడమనూరులో మంగళవారం చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు పని చేసినా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని, భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశంలో జనగణనతోపాటు కుల గణన జరుగాలని, మహిళా బిల్లు విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదని అన్నారు. నియంతృత్వ పోకడలతో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్న బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్రెడ్డి పాల్గొన్నారు.