హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): బయ్యారం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం బరితెగించి వ్యవహరిస్తున్నదని సీపీ ఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మోదీ సర్కారు అనుసరిస్తున్న మతోన్మాద, నియంతృత్వ, అణచివేత విధానాలను దేశంలో బలంగా వ్యతిరేకిస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరేనని, అందుకే తెలంగాణ పట్ల కక్ష పూరితం గా వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలి మతోన్మాద ధోరణితో దేశమంతటా ఉద్రిక్త వాతావరణం సృష్టించి రాజకీయంగా లబ్ధిపొందుతున్న బీజేపీ వైఖరిని ప్రజలు గుర్తించారని, సంక్షేమంలో దేశానికే స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ మాడల్ను వివిధ రాష్ర్టాలు, ప్రజలు కోరుకుంటున్నారని చెప్పా రు. తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ జాతీయ స్థాయిలో తన సేవలను విస్తృతం చేసేందుకు జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని వామపక్ష పార్టీలుగా స్వాగతిస్తున్నామని ‘నమస్తే తెలంగాణ’ ఇంటర్వ్యూలో చెప్పారు.
విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో కేంద్రం తెలంగాణ పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఎనిమిదేండ్లు గడుస్తున్నా తెలంగాణకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని పక్కకు పెట్టేందుకే.. అక్క డి గనుల్లో నాణ్యతలేదనే సాకును ముందుకు తీసుకొచ్చింది. బయ్యారం ఉక్కు తెలంగాణ హక్కు. దీనిపై ఇప్పటికే అనేక ఆందోళనలు నిర్వహించాం. బయ్యారం ఖనిజంలో నాణ్యతలేదని చెప్పడం పూర్తి అబద్ధం. కేవలం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికే ఈ కుట్రలు.
మోదీ అనాలోచిత నిర్ణయాలను దేశంలో అందరి కంటే ఎక్కువగా ప్రశ్నిస్తున్నది సీఎం కేసీఆర్ ఒక్కరే. తెలంగాణ అభివృద్ధి నమూనా ను ఇతర రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. దీంతో గుజరాత్ మాడల్ విఫలమైందని మోదీకి అర్థమైంది. దీంతో తన ఉనికి ప్రశ్నార్థకమవుతున్నదనే భయం మోదీలో నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. రాష్ర్టానికి రావాల్సిన నిధులలో కోత పెడుతున్నారు. రాష్ట్ర పథకాలకు కేంద్రం వాటాలను నిలిపివేస్తున్నారు.
మతోన్మాద విధానాలను మొదటి నుంచి సీపీఎం వ్యతిరేకిస్తున్నది. ప్రజాస్వామ్య, లౌ కిక, ప్రజాతంత్ర శక్తులను కలుపుకొని బీజేపీ విస్తరణను నియంత్రిస్తాం. ప్రజలకు బీజేపీ వైఖరిని వివరిస్తాం. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాం. ప్రజలపై పన్నులు పెంచుతూ, గుజరాత్కు చెందిన కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న విధానంపై పోరాటాలు కొనసాగిస్తాం. 2024లో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి వామపక్షాలు సర్వ శక్తులను ఒడ్డుతాయి.
కేసీఆర్ ప్రారంభించనున్న జాతీయ పార్టీని సీపీఎం స్వాగతిస్తున్నది. మతోన్మాదాన్ని అడ్డుకోవడమే సిద్ధాంతంగా కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపిస్తున్నందున ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. మోదీ అహంకారం, అణిచివేత, రాక్షసత్వం, నియంతృత్వం, మతోన్మాద విధానాలను అడ్డుకోవడానికి కేసీఆర్ చేసే పోరాటానికి లౌకిక, ప్రజాస్వామ్య శక్తులన్నీ మద్దతు ప్రకటిస్తాయి. అదే సమయంలో బీజేపీని వ్యతిరేకించే పక్షాలతో కూడా కేసీఆర్ కలిసి నడవాలి.
వామపక్షాలు సీట్లు, ఓట్ల కోసం కాకుండా ప్రజా సమస్యలు, సిద్ధాంతాలు ఎజెండాగా పనిచేస్తాయి. బీజేపీ మతోన్మాద దాడులను వామపక్షాలు సమర్థంగా ఎదుర్కొంటున్నాయి. పశ్చిమబెంగాల్, త్రిపుర, కేరళ రాష్ర్టాల్లో సీపీఎం బలంగా ఉన్నది. తెలుగు రాష్ర్టాల్లో పరిస్థితులు, పొత్తుల వల్ల సీట్లు పొందలేకపోయాం. కానీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా రెండు అంచెల ప్రణాళికతో పనిచేస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ఎన్నికల ముందు పొత్తులు పెట్టుకొని పనిచే స్తాం. జాతీయ స్థాయిలో ఎన్నికల అనంతరం బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ఫ్రంట్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం.. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం కష్టం కాదు.
జాతీయ స్థాయిలో బీజేపీ కట్టడికి ప్రత్యామ్నాయం అవసరం. ప్రస్తుతం కాంగ్రెస్ బలం గా లేదు. పార్టీకి స్థిరమైన ఓటుబ్యాంకు ఉన్నప్పటికీ అంతర్గత పోరు, నాయకత్వ సమస్యను ఆ పార్టీ ఎదుర్కొంటున్నది. బీజేపీని గట్టిగా ఎదుర్కొనే శక్తి దానికి లేదు. కేసీఆర్ నాయకత్వంలోని జాతీయ పార్టీతో పాటు మిగతా శక్తులను కలుపుకొని బీజేపీని అడ్డుకుంటాం.