హైదరాబాద్: రాష్ట్రాల విధానాలు, వసూలు చేస్తున్న పన్నులే పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కారణమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం దారుణమని, రాష్ట్రాలపై మోడీ సర్కారు దాడి చేస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మోడీ వ్యాఖ్యలను గురువారం ఒక ప్రకటనలో వీరభద్రం తీవ్రంగా ఖండించారు. పెట్రోల్, డీజిల్ ధరలను క్రమంగా పెంచుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుమతిస్తుందన్నారు.
వారంలోనే ఎనిమిదిసార్లు ధరలు పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కుతుందని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. పెట్రో ఉత్పత్తులపై ఏటా మూడు లక్షల కోట్ల రూపాయల ఆదాయం కేంద్రానికి వస్తుందని, అందులో 49శాతం వాటా రాష్ట్రాలకు ఇవ్వాల్సి ఉన్నా.. మోడీ ప్రభుత్వం ఇవ్వడం లేదన్నారు. పన్నుల రూపంలో వసూలు చేస్తే రాష్ట్రాలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని, సెస్ల రూపంలో వసూలు చేస్తూ కేంద్ర సర్కారు రాష్ట్రాలకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు. ఇంత మోసం, దగా చేస్తూ మళ్లీ రాష్ట్రాలపైనే దాడి చేయడం దారుణమన్నారు. ఇప్పటికైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేందుకు మోడీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీని విమర్శించడం సంతోషకరమన్నారు. నయా ఉదారవాద విధానాలను వ్యతిరేకించే ప్రత్యామ్నాయ ఎజెండాతో సీఎం కేసీఆర్ ముందుకు రావాలని వీరభద్రం ఆకాంక్షించారు.