Kaleshwaram | కరీంనగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): ‘కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తే వినడం తప్పా ఇంతవరకూ చూడలేదు. దీన్ని చూసిన తర్వాత చాలా అద్భుతంగా ఉంది’ అని పలు ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు గాయత్రి పంప్హౌస్ను జిల్లాలోని జ్యోతిష్మతి, వాగేశ్వరి, శ్రీచైతన్య, విట్స్, కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలకు చెందిన సుమారు 600 మందికి పైగా విద్యార్థులు సందర్శించారు. డీఈ రాంప్రదీప్ ఆధ్వర్యంలోని ఇంజినీర్ల బృందం వారికి ప్రాజెక్టు గురించి వివరించింది. కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కూడా విద్యార్థులతో కలిసి ప్రాజెక్టు పంప్హౌస్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులను ప్రాజెక్టు గురించి అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా ప్రాజెక్టు కెపాసిటీ ఎంత? రేటింగ్ ఎంత? దీనికి కావాల్సిన పవర్ ఎంత? ఒక్కో మోటర్కు కావాల్సిన ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీ ఎంత? ఎంత డిశ్చార్జ్ అవుతుంది? వంటి టెక్నికల్ ప్రశ్నలు వేసి అధికారుల నుంచి సమాధానాలు రాబట్టారు. అధికారులు.. విద్యార్థులకు అర్థమయ్యే విధంగా సమాధానాలు చెప్పారు. ఒక్కో పంప్ డిశ్చార్జ్ 3,100 క్యూసెక్కులు ఉంటుందని, 139 మెగావాట్స్ రేటింగ్ ఉంటుందని, ఒకేసారి 7 పంపులు నడిస్తే 2 టీఎంసీల నీటిని ఎత్తిపోయవచ్చని విద్యార్థులకు వివరించారు. ఎల్లంపల్లి నుంచి నందిమేడారం.. అక్కడి నుంచి గాయత్రి పంప్హౌస్కు.. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా ఎఫ్ఎఫ్సీ ద్వారా మిడ్మానేరుకు నీటిని తరలిస్తున్న తీరును అధికారులు విద్యార్థుల కండ్లకు కట్టినట్టు వివరించారు.
అధికారులు చెప్పిన విషయాలకు ఇంజినీరింగ్ విద్యార్థులు సంబురపడ్డారు. సాగు నీటి దినోత్సవంలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టును మొదటి సారి సందర్శించడం తమకు గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటే కండ్లతో ఏదైనా విషయాన్ని ప్రత్యక్షంగా చూస్తేనే వాస్తవికత అర్థమవుతుందని, అందులో భాగంగానే 600 మందికి పైగా ఇంజినీరింగ్ విద్యార్థులు గాయత్రి పంప్ హౌస్ను తిలకించారని కరీంనగర్ కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అన్నారు. దేశంలో ఇటువంటి ప్రాజెక్టు మరొకటి చూడలేమని, సీఎం కేసీఆర్ ముందుచూపు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని చరిత్రాత్మక కాళేశ్వరం నిర్మాణానికి పూనుకున్నారని చెప్పారు.
కాగా.. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఇరిగేషన్ ప్రాజెక్టును ఇంజినీరింగ్ విద్యార్థులు సందర్శించడం అభినందనీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. కండ్లతో చూస్తేనే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందని, సీఎం కేసీఆర్ భవిష్యత్తు తరాల కోసం పడుతున్న తపన తెలుస్తుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు తమ విద్యార్థులను ప్రాజెక్టుల వద్దకు తీసుకెళ్లి చూపించాలని వినోద్కుమార్ సూచించారు.