నాగర్కర్నూల్, ఫిబ్రవరి 26 : కుమ్మెర బాధితులను రెండు వారాల్లోగా ఆదుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమవుతామని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. కుమ్మెర బాధితులు నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలో చేపడుతున్నా ధర్నా శిబిరాన్ని గురువారం తలసాని సందర్శించి సంఘీభావం తెలిపారు. గణేశ్ కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతున్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు పెరిగిపోయాయని ధ్వజమెత్తారు. వీరికి పోలీసులు వంతపాడుతున్నారని విమర్శించారు. కుమ్మెర ఘటన సీఎం సొంత జిల్లాలో జరగడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
రజక కుటుంబంపై దాడి ఘటనలో పసికందు చనిపోయినా సీఎం స్పందించకపోవడం దారుణమని అన్నారు. పసిగుడ్డును కోల్పోయిన ఆ తల్లి కడుపుకోతను ఎవరు తీర్చగలరని ప్రశ్నించారు. బహుజనులు, బీసీ, ఎస్సీ, ఎస్టీలంతా ఐక్యంగా ఉండి ఇలాంటి ఘటనలను ఎదురించినప్పుడే ప్రభుత్వాల మెడలు వంచడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. కుమ్మెర ఘటనలో పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శించారని ఆరోపించారు. కేసులు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాల్సిందిపోయి సీఐ ఒక విధంగా, డీఎస్పీ మరోవిధంగా, ఎస్పీ ఇంకో రకంగా మాట్లాడటం సరికాదని అన్నారు. బాధితుడు గణేశ్ ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి కేసు నమోదు చేయాల్సి ఉన్నా.. 3 గంటలపాటు స్టేషన్లో కూర్చోబెట్టి.. ఫిర్యాదు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ దాడిలోనే రెండు నెలల శిశువు గాయపడి చనిపోయిందని కన్నతల్లి చెప్తున్నా నిందితులపై మర్డర్కేసు పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. నిందితులపై మర్డర్ కేసు పెట్టి జైలులో పెట్టకపోతే రాష్ట్రవ్యాప్తంగా బహుజనులమంతా కలిసి రోడ్లపైకి వచ్చి ఉద్యమిస్తామని హెచ్చరించారు. గణేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని, ఈ విషయంలో కేటీఆర్ హామీ ఇ చ్చారని, అన్ని విధాలా ఆదుకుంటామని భరో సా కల్పించారు. అసెంబ్లీలోనూ ఈ ఘటనపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బైకాని శ్రీనివాస్యాదవ్ తదితరులు ఉన్నారు.