హైదరాబాద్ : చదువుల తల్లి సావిత్రిబాయిపూలే (Savitribai Phule) ను మహిళలు స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని రాష్ట్ర పంచాయత్రాజ్ శాఖ మంత్రి సీతక్క ( Minister Seetakka ) అన్నారు. దేశంలోనే ప్రథమ మహిళా ఉపాధ్యాయురాలిగా పనిచేసి మహిళల విద్యకోసం పోరాడిన సామాజిక విప్లవకారిణి అని కొనియాడారు. సావిత్రిబాయిఫూలే ఉమెన్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, తెలంగాణ చాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ సంయుక్త ఆధ్వర్యంలో రవీంద్రభారతీలో సావిత్రిబాయిఫూలే 193వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మంత్రి సీతక్క మాట్లాడారు. సావిత్రిబాయిఫూలే స్ఫూర్తితోనే నేడు మహిళలు చదువుతోపాటు అన్ని రంగాలలో రాణిస్తున్నారని తెలిపారు. అలాంటి మహానీయురాలి జయంతి నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. అంతకుముందు ఆమె భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, వ్యవస్థాపకురాలు బెల్లం మాధవిలతో కలసి జ్యోతి ప్రజ్వలనం చేసి సావిత్రిబాయిపూలే చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.