హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో కోతుల బెడద కారణంగా పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదే విధంగా పంటలను నష్టపర్చకుండా కోతుల నియంత్రణకు తీసుకున్న చర్యలను వివరించాలని సూచించింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ టీ వినోద్కుమార్తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
కోతుల బెడదపై ఎం శ్రీనివాసరావు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంతోపాటు మరో రెండు వ్యాజ్యాలను బుధవారం ధర్మాసనం విచారించింది. కోతుల నివారణకు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను హైకోర్టు కొని యాడింది. విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.