మహబూబాబాద్, ఆగస్ట్ -10 : గాంధీజీని సినిమాను స్ఫూర్తిగా తీసుకొని జీవితంలో ఎదగాలని, అలాగే ఇష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బుధవారం మంత్రి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ కె. శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి స్థానిక సూర్య కళామందిర్ సినిమా టాకీస్లో గాంధీ చిత్రాన్ని విద్యార్థులతో కలిసి తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుని 75 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్ర సమర యోధుల పోరాట పటిమను గుర్తు చేసుకునేలా వజ్రోత్సవ వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించడం అభినందనీయమన్నారు.
దీని నుంచి స్ఫూర్తి పొంది భావి భారత పౌరులుగా ఎదగాలన్నారు. సీఎం కేసీఆర్ గాంధీ చూపిన మార్గంలోనే రాష్ట్రం సాధించి అభివృద్ధిలో దేశంలోనే ముందంజలో ఉంచారన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ సదయ్య, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ పాల్వాయి రాం మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, ఆర్డీవో కొమురయ్య, తహసిల్దార్ నాగాభవాని, తదితరులు పాల్గొన్నారు.