పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అందులో సందేహం లేదు. అయితే పల్లెలు, పట్టణాలల్లో పారిశుద్ధ్యం పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలను నిత్యం కొనసాగించాలె. అది నిరంతర ప్రక్రియ. ఈ క్రమంలో పంచాయతీరాజ్ సహా సంబంధిత శాఖల ఉద్యోగులు ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదు. మీకు పూర్తి సమయమివ్వాలనే నేను ఇన్ని రోజులు పర్యటన చేపట్టలేదు. రెండేండ్లు గడిచిపోయినయి. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. అలసత్వం వహించిన ఏ స్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు. క్షమించేదీలేదు. కఠిన చర్యలు తీసుకుంటం.
-సమీక్షలో సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): పల్లెలు, పట్టణాల్లో జరుగుతున్న ప్రగతి తీరును, అధికారుల పనితీరును పరిశీలించేందుకు ఈ నెల 19 తర్వాత తానే స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేపడుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రకటించారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాల క్షేత్రస్థాయి పనితీరును సమీక్షించడానికి ఆదివారం (ఈ నెల 13న) అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారుల (డీపీవో)లతో ప్రగతిభవన్లో సమావేశాన్ని ఏర్పాటుచేయనున్నామని తెలిపారు. సీజనల్ వ్యాధులను అరికట్టేందుకు ముందస్తు చర్యలను సిద్ధం చేసుకునే చార్టును రూపొందించుకోవాలని, ఈ సంసృతిని ఆయాశాఖలు అభివృద్ధి చేసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, పాజిటివిటీ రేటు 1.47 శాతానికి పడిపోయిందని తెలిపారు. కరోనా పూర్తిగా తగ్గాక మరో విడుత పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యక్రమాలను చేపడుతామని వివరించారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి అటవీశాఖ ప్రత్యేక కార్యాచరణను కొనసాగించాలని చెప్పారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి తీరు, అందుకనుగుణంగా అదనపు కలెక్టర్లు, డీపీవోలు సహా మున్సిపల్, పంచాయతీరాజ్ సిబ్బంది పనితీరు, చేపట్టాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతిభవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఠంచన్గా నిధులు విడుదల
నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలను అమల్లోకి తెచ్చి పల్లెలు, పట్టణాల అభివృద్ధికి దేశంలో ఎకడా లేనివిధంగా ప్రభుత్వం సహకారం అందిస్తున్నదని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాల అభివృద్ధికి రూ.339 కోట్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.148 కోట్లు ప్రతినెలా క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామని చెప్పారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో కిందినుంచి పైస్థాయివరకు సి బ్బందిని పూర్తిస్థాయిలో నియమించామని గుర్తుచేశారు. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని, అయితే, ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలు మిగిలే ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని సాధించడంలో నిర్దేశించిన బాధ్యతలను నిర్వర్తించడంలో ఉద్యోగులు, అధికారులు ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకోవాల్సి ఉన్నదన్నారు. తాత్సారం జరిగినట్టు, నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు గుర్తిస్తే.. ఎవరినీ క్షమించబోనని హెచ్చరించారు.
చార్టులను రూపొందించండి
గ్రామాలు, మున్సిపాలిటీల్లో ఇప్పటిదాకా ఏమేమి పనులు జరిగాయో చార్టులను రూపొందించాలని సీఎస్ సోమేశ్కుమార్ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రగతిలో భాగంగా పచ్చద నం, పారిశుధ్యం, మంచినీటి సరఫరా, మొక ల స్థితి, అవి బతికిన శాతం, గ్రామసభలు నిర్వహించిన తీరు, స్థానిక ఎంపీవోలు పాల్గొన్న తీ రు, గ్రామ ప్రగతికోసం తీసుకున్న చర్యలు, గ్రామసభల నిర్వహణ, గ్రామ ప్రగతి నివేదికల మీద జరిగిన చర్చల సారాంశం వంటి అంశాలను చార్టులో పొందుపర్చాలని సూచించారు. చెత్తసేకరణ, డంపుయార్డులు, వైకుంఠధామాల నిర్మాణం, బోరుబావులు పూడ్చటం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారిశుధ్య నిర్వహణ, ట్రాక్టర్ల కిస్తులు, కరెంటు బిల్లుల వసూలు, పంచాయతీ ఉద్యోగులకు జీతాల చెల్లింపు, డ్రైనేజీలు, నాలాలు శుభ్రపర్చడం, వెజ్ నాన్వెజ్ మారెట్ల నిర్మాణం వంటి అంశాలు కూడా ఉండాలని చెప్పారు. ఉత్తమ గ్రామాలు, మండలాలు, అధ్వానంగా ఉన్న గ్రామాలు, మండలాలను గుర్తించడంతోపాటు అందుకు కారణాలను ఈ చార్టులో ప్రత్యేకంగా పేరొనాలన్నారు. పురోగతినే కాకుండా.. వెనుకబాటును కూడా చార్టు రూపంలో సిద్ధం చేయాలని.. మంచి చెడులను రెండింటినీ ప్రాతిపదికగా తీసుకుని చార్టును తయారుచేసి, ఆకస్మిక తనిఖీ పర్యటనలో తనకు అందచేయాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులను ముందే అరికట్టేందుకు గ్రామాల్లో ఇకపై సీజన్వారీగా చార్ట్ తయారుచేయాలని అధికారులకు సూచించారు.
వారి పనితీరు అనుకున్నంత స్థాయిలో లేదు
గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా, పచ్చదనంతో నిర్వహించుకోవడం కంటే మించిన పని ప్రభుత్వానికి మరొకటి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ‘పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. అందులో సందేహం లేదు. అయితే ఈ కార్యక్రమాలను నిత్యం కొనసాగించాలె. ఈ క్రమంలో పంచాయతీరాజ్ సహా సంబంధితశాఖల ఉద్యోగులు ఏమాత్రం అలసత్వానికి తావివ్వకూడదు. మీకు పూర్తి సమయమివ్వాలనే నేను ఇన్నిరోజులు పర్యటన చేపట్టలేదు. రెండేండ్లు గడిచిపోయినయి. ఇక నేను రంగంలోకి దిగక తప్పదు. అలసత్వం వహించిన ఏస్థాయి అధికారినైనా ఉపేక్షించేది లేదు. క్షమించేదీలేదు. కఠినచర్యలు తీసుకుంటం’ అని సీఎం స్పష్టంచేశారు. ‘అదనపు కలెక్టర్లను నియమించుకోవడంలో ప్రధాన ఉద్దేశం.. పల్లెలు పట్టణాలను బాగు చేసుకోవడానికే. వారు నిరంతరం క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉండాలి. డీపీవోలు సహా కిందిస్థాయి ఉద్యోగులను ఆ దిశగా ఉత్సాహపరుస్తూ అనుకున్న లక్ష్యాన్ని సాధించాలి. కానీ అదనపు కలెక్టర్లు అనుకున్న రీతిలో తమ పనిసామర్ధ్యాన్ని నిరూపించుకోవడం లేదు. వారినుంచి నేను చానా ఆశించిన. కానీ అనుకున్నస్థాయికి వారి పనితీరు చేరుకుంటలేదు. పంచాయతీరాజ్శాఖ మంత్రి, మున్సిపల్ మంత్రులు మాత్రమే అన్నీ చేయాలంటే కాదు. ఏ జిల్లాలో ఆ జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అన్ని స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో మరింతగా భాగస్వాములు కావాలె. ప్రజలను చైతన్యపరిచి వారిని మరింతగా భాగస్వాములను చేయాలె’ అని సీఎం వివరించారు.
మానేరు రివర్ ఫ్రంట్కు రూ.310.46 కోట్లు
మంత్రి గంగులకు జీవో కాపీ అందజేసిన సీఎం కేసీఆర్
హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): లోయర్ మానేరు నది సుందరీకరణ, పటిష్ఠతకు చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్కు ప్రభుత్వం తాజాగా రూ.310.46 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో 4 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ నిర్మించనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన జీవో ప్రతిని ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా శుక్రవారం ప్రగతి భవన్లో మంత్రి గంగుల కమలాకర్కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు గంగుల ధన్యవాదాలు తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ డీపీఆర్ తయారీకి సంబంధించిన టెండర్ ఖరారుకు విధివిధానాలను రూపొందించేందుకు మంత్రి కేటీఆర్ అధ్యక్షతన శనివారం సమీక్ష నిర్వహించనున్నారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్గౌడ్, సంబంధిత శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొననున్నారు. మానేరు రివర్ ఫ్రంట్లో భాగంగా రూ.80 కోట్లతో చెక్డ్యాంలు, రూ.190 కోట్లతో కేబుల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ఇప్పటికే
మొదలయ్యాయి.
అధికారులు జిల్లాల బాట పట్టాలి
ఇకనుంచి మున్సిపల్ డైరెక్టర్, పంచాయతీరాజ్ కమిషనర్లు జిల్లాలు, గ్రామాల పర్యటన చేపట్టాలని.. వారుక్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై పల్లెలు, పట్టణాల ప్రగతి తీరును పరిశీలించాలని, డీపీవోలను కూడా పల్లెల పర్యటనల్లో నిమగ్నం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. గ్రామాలు,మున్సిపాలిటీల పరిధిలో అక్రమ లేఅవుట్లు యథావిధిగా కొనసాగుతున్నట్టు తనకు సమాచారం ఉన్నదని, వాటిగురించి చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపాలిటీల బడ్జెట్ తయారీలో కలెక్టర్లు భాగస్వాములు కావాలని చెప్పామని, ఏ మేరకు అవుతున్నారనే దానిపై ఆరాతీశారు. తెలంగాణ ముఖచిత్రానికి జాతీయ రహదారులు అద్దం పడుతాయని, వాటివెంట మొక్కలు నాటి పెంచాలని తెలిపారు. మొకలు పెంచి సంరక్షించే బాధ్యత సంబంధిత కాంట్రాక్టర్లదే కాబట్టి వారితో మొకలు నాటించే కార్యక్రమాన్ని పట్టుబట్టి చేయించాలని సూచించారు. రాష్ట్రంలో అడవుల పునరుజ్జీవనం మీద ప్రత్యేకదృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
ఆ మూడు శాఖలు సమన్వయంతో పనిచేయాలి
జూన్ 13న ప్రగతిభవన్లో అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కోసం చేపడుతున్న కార్యాచరణ, వారి పనితీరుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘ప్రతి సీజన్లో కొన్ని ప్రత్యేక వ్యాధులు ప్రబలుతుండడం సహజం. వానకాలం వస్తే మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు, చలికాలంలో స్వైన్ఫ్లూ వంటి వ్యాధులు, ఎండాకాలంలో డయేరియా వస్తుంటయి. కరోనా వంటి వ్యాధుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులను ముందే గుర్తించి అరికట్టడం అతిముఖ్యం. ఇందుకు పంచాయితీరాజ్శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్శాఖ, హెల్త్ డిపార్ట్మెంట్ సమన్వయంతో పనిచేయాలి’ అని సీఎం సూచించారు. వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో మంచినీటి ట్యాంకులను శుద్ధిచేసి తాగునీరును అందిచాలని ఆదేశించారు. కరోనా నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఎన్ఎం, ఆశ వరర్లు సహా వైద్యారోగ్యశాఖ ఉద్యోగులను సమాయత్తపర్చాలని, వారిని ముందే సీజనల్ వ్యాధులను నివారించే చర్యలకు సిద్ధం చేయాలని ఆదేశించారు. అభివృద్ధి కండ్లకు కనిపించినప్పుడే ప్రజలు ప్రజాప్రతినిధులు వెంట నడుస్తారని, ఆ దిశగా ఇప్పటికే విజయం సాధించిన పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు దేశంలోనే ఉత్తమమైనవిగా గుర్తించబడ్డాయని తెలిపారు. ఈ నేపథ్యంలో అలసత్వం వదిలి, మరింత పట్టుదలతో పనిచేసి తెలంగాణను అద్దంలా తీర్చిదిద్దుకోవాలని స్పష్టంచేశారు.
కరోనా తగ్గుముఖం
రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒక్క శాతానికి పాజిటివిటీ రేటు చేరుకున్నదని అధికారులు సీఎం కేసీఆర్కు వివరించారు. ప్రభుత్వ దవాఖానల్లో బెడ్లు ఎకువ శాతం ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కరోనా రోగులను పరామర్శించేందుకు సీఎం కేసీఆర్ ఇటీవల చేపట్టిన గాంధీ, ఎంజీఎం దవాఖానల పర్యటన.. రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితుల్లోనే కాకుండా, చికిత్స అందించే వైద్యుల్లోనూ ఎంతో భరోసాను, ధైర్యాన్ని నింపిందని సమావేశం అభిప్రాయపడింది. ఐసీయూల్లో కరోనాకు చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి పరామర్శించిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని, తద్వారా కరోనా భయాన్ని తొలగించి ఆత్మసె్థైర్యాన్ని నింపడంలో సీఎం ముందువరుసలో ఉన్నారని అధికారులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు కే తారకరామారావు, ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే ఏ జీవన్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, మున్సిపల్ వ్యవహారాల ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్, పంచాయతీరాజ్శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్, ఓఎస్డీ ప్రియాంకవర్గీస్, మున్సిపల్ డైరెక్టర్ సత్యనారాయణ, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్రావు తదితరులు పాల్గొన్నారు.