హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): సాగునీటి శాఖ మంత్రి ఇలాకా కోసం ఎస్సారెస్పీ 1 ఆయకట్టును పణంగా పెడుతున్నారు. టెయిల్ టు హెడ్ మాటున జలాలను సూర్యాపేటకు తరలించుకుపోతున్నారు. స్టేజ్ 1 డిస్ట్రిబ్యూటరీలకు నామమాత్రంగా జలాలను విడుదల చేస్తూ స్టేజ్ 2కు పూర్తిస్థాయిలో నీళ్లను మళ్లిస్తున్నారు. దీంతో ఎగువన ఉన్న ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మరో రెండు వారాలకు మించి సాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నదని అధికారులు వెల్లడిస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం ద్వారా జలాలను ఎత్తిపోసుకొనే అవకాశమున్నా ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తున్నది. వెరసి ఎస్సారెస్పీ ఆయకట్టు మొత్తంగా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారే దుస్థితి నెలకొన్నది. ఎస్సారెస్పీ స్టేజ్ 1లో అంటే ఎల్ఎండీకి ఎగువన అంటే ఎస్సారెస్పీ నుంచి కాకతీయకాలువ 0-146 కిలోమీటర్లు ఎల్ఎండీ వరకు 4,62,920 ఎకరాలు, దిగువన అంటే కాకతీయ కెనాల్ 146-284 కిలోమీటర్ల వరకు అంటే మైలారం వరకు 5,05720 ఎకరాలు మొత్తంగా 9,68,640 ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉన్నది.
ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు కాకతీయ ప్రధాన కాలువ పూర్తిస్థాయి సామర్థ్యం 9,700 క్యూసెక్కులు, కాగా ప్రస్తుతం కేవలం 6,500 క్యూసెక్కులను మాత్రమే విడుదల చేస్తున్నారు. ఎల్ఎండీ దిగువ నుంచి బయ్యన్నవాగు వరకు కాలువ ప్రవాహ సామర్థ్యం 6 వేల క్యూసెక్కులు కాగా, ప్రస్తుతం 4 వేల క్యూసెక్కుల కంటే తక్కువగానే విడుదల చేస్తున్నారు. నిరుడికన్నా చాలా తక్కువ పరిమాణంలో నీటిని వదులుతున్నారు. ఇదిలా ఉండగా ఎస్సారెస్పీ నుంచి ఎల్ఎండీ వరకు 94 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఎల్ఎండీ దిగువన బయ్యన్నవాగు వరకు మొత్తంగా దాదాపు 54 డిస్ట్రిబ్యూటరీ మెయిన్ కెనాల్స్ ఉన్నాయి. ప్రధాన కాలువకే తక్కువ మొత్తంలో నీటిని విడుదల చేస్తుండటంతో డిస్ట్రిబ్యూటరీలకు సరిపడా నీరందని పరిస్థితి నెలకొన్నది. అదీగాక కాలువలపై వేల సంఖ్యలో మోటర్లను పెట్టి ఎగువన ఉన్న రైతులు నీటిని పంపింగ్ చేసుకుంటున్నారు. దీంతో దిగువకు మరింత తక్కువ మొత్తంలో జలాలు చేరుతున్నాయి. ఆయా డిస్ట్రిబ్యూటరీల్లోని చివరి ఆయకట్టుకు నీరందని దుస్థితి నెలకొన్నది.
ఈ ఏడాది యాసంగికి ఎస్సారెస్పీ స్టేజ్ 1లో పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఆ మేరకు ప్రకటించారు కూడా. అయితే ప్రస్తుతం స్టేజ్ 1లో ఉన్న అనేక డిస్ట్రిబ్యూటరీలకు నీటి విడుదలను నిలుపుదల చేశారు. సాగునీరివ్వలేమని రైతులకు తేల్చిచెప్తున్నారు. ప్రధాన కాలువ నుంచి డిస్ట్రిబ్యూటరీలకు నామమాత్రంగా నీటిని విడుదల చేస్తున్నారు. అదీగాక డిస్ట్రిబ్యూటరీ కింద సగం మేరకే నీటి విడుదలను పరిమితం చేస్తున్నారు. ఎల్ఎండీ ఎగువన డీ 53, డీ 86, డీ 39లోనే పూర్తిస్థాయిలో సాగునీరందని పరిస్థితి నెలకొన్నది. ఎల్ఎండీ దిగువన పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
డీబీఎం 38 కెనాల్ ద్వారా భూపాలపల్లి జిల్లా రేగొండ, చిట్యాల, టేకుమట్ల ప్రాంతాలకు సాగునీరందాల్సి ఉన్నది. ప్రస్తుతం ఆ కాలువ 40వ కిలోమీటర్కే అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. దిగువన చిట్యాల, టేకుమట్లకు నీటివిడుదలను పూర్తిగా నిలిపివేశారు. అదేవిధంగా డీబీఎం 40 ద్వారా నల్లబెల్లి, నర్సంపేట తదితర మండలాలకు సాగునీరందాల్సి ఉన్నది. నిరుడు నిండుగా పారిన కాలువ నేడు నామమాత్రంగా పారుతున్నది. ఒక్క నర్సంపేట మండలంలోనే దాదాపు 17 గ్రామాలకు సాగునీరందడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా డీబీఎం 15 కింద ఇల్లంతకుంట మండలానికి మాత్రమే మోస్తరుగా సాగునీరందుతుండగా, దిగువ ఆయకట్టుకు నీరందడంలేదని రైతులు వాపోతున్నారు. డీబీఎం 6, 7, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గంలోని డీబీఎం-48, 60 ఇలా ఇంచుమించు అన్ని డిస్ట్రిబ్యూటరీల కింద ఇదే పరిస్థితి నెలకొన్నది. డిస్ట్రిబ్యూటరీ పరిధిలోని సగం ఆయకట్టుకు మాత్రమే నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి.
కాకతీయ కాలువను 284 కిలోమీటరు నుంచి 347 కిలోమీటరు వరకు ఎస్సారెస్పీ స్టేజ్ 2గా పిలుస్తారు. డీబీఎం 54 నుంచి డీబీఎం 71 వరకు దీని పరిధిలో ఉన్నాయి. తర్వాత ఇది మూసీలో కలుస్తుంది. కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేట తదితర ప్రాంతాలకు సాగునీటిని అందించాల్సి ఉన్నది. స్టేజ్ 2 కాలువ ప్రవాహ సామర్థ్యం 4 వేల క్యూసెక్కులు కాగా ప్రస్తుతం 3వేల క్యూసెక్కుల మేరకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎస్సారెస్పీ స్టేజ్1 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీరందని పరిస్థితులు నెలకొన్నా స్టేజ్ 2 ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తున్నారు. స్టేజ్ 1లోని డిస్ట్రిబ్యూటరీలకు ఎక్కడిక్కడ కోత పెడుతూ, సామర్థ్యం మేరకు జలాలను విడుదల చేయకుండా, కేవలం కంటితుడుపుగా నీటిని విడుదల చేస్తూ స్టేజ్ 2 ఆయకట్టుకు నీటిని మళ్లిస్తున్నారు. సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఒత్తిడిమేరకే ఎగువన ఆయకట్టుకు కోత పెడుతూ దిగువ ఆయకట్టుకు నీటిని తరలిస్తున్నారని తెలుస్తున్నది. అదేమని అడిగితే గతంలో ఉన్న టెయిల్ టు హెడ్ (చివరి నుంచి మొదలు) పద్ధతినే ప్రస్తుతం అనుసరిస్తున్నామని అధికారులు చెప్తున్నారు. ప్రాజెక్టుల్లో సమృద్ధిగా జలాలు ఉన్నప్పుడే ఆ పద్ధతిని అమలు చేయడం పరిపాటి. కానీ ప్రస్తుతం ప్రాజెక్టుల్లో నిరుడి కన్నా తక్కువ మొత్తంలో నీటి నిల్వలు ఉన్నా కూడా ఎగువ ఆయకట్టును విడిచి పెట్టి దిగువ ఆయకట్టుకు నీటిని విడుదల చేయమేంటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. అదీగాక వారంపాటు నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేవలం రెండు, మూడు రోజులు మాత్రమే డిస్ట్రిబ్యూటరీలకు నీటిని విడుదల చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.
ప్రస్తుతం ఎస్సారెస్పీ ఆయకట్టుకు సంబంధించిన ప్రాజెక్టుల్లో కేవలం మార్చి 2వ వారం వరకు మాత్రమే సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని అధికారులు వెల్లడిస్తున్నారు. పూర్తిస్థాయిలో సాగునీటిని అందించే పరిస్థితి లేదని తేల్చిచెప్తున్నారు. ప్రస్తుతం ఎస్సారెస్పీలో 50 టీఎంసీలు, ఎల్లంపల్లిలో 12.77 టీఎంసీలు, మిడ్మానేర్ 15.76 టీఎంసీలు, ఎల్ఎండీలో 16.49 టీఎంసీలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక ఎస్సారెస్పీ జలాలపై ఆధారపడి చౌటుపల్లి హన్మంతరెడ్డి, అలీసాగర్, గుత్ప ఎత్తిపోతల ఆయకట్టు కూడా ఉన్నది. ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ తాగునీటి జలాలు కూడా ఇవ్వాల్సి ఉన్నది. ఇప్పటికే ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఎల్ఎండీకి 3 టీఎంసీల మేరకు జలాలను తరలించామని, ఇక అంతకు మించి ఇవ్వలేమని అధికారులు చేతులు ఎత్తేస్తున్నారు. మొత్తంగా ఎటుచూసినా మార్చి రెండో వారం వరకే సాగునీటిని విడుదల చేసే అవకాశాలున్నాయని వివరిస్తున్నారు. నిరుడితో పోల్చితే భూగర్భజలాలు సైతం వేగంగా లోతుకు పడిపోతున్నాయి. దీంతో ఎస్సారెస్పీ ఆయకట్టు మొత్తం ప్రశ్నార్థకంగా మారే పరిస్థితులు నెలకొన్నాయి.
పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నా కూడా ప్రభుత్వం ఆ దిశగా దృష్టి సారించని దుస్థితి నెలకొన్నది. కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేయాలనేదానిపై చూపెడుతున్న ఆసక్తిని నీటిని ఎత్తిపోసుకునే అంశంపై కేంద్రీకరించడంలేదు. మేడిగడ్డలోని లక్ష్మీబరాజ్, అన్నారం, సుందిళ్ల బరాజ్లు మరమ్మతులు కొనసాగుతున్న కూడా నీటిని ఎత్తిపోసుకొనే అవకాశముందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికీ ప్రాణహితలో రోజుకు సగటున 5వేల క్యూసెక్కులకు మించి ప్రవాహాలు కొనసాగుతున్నాయి. ఆ జలాలను ఒడిసిపడితే ఎస్సారెస్పీ ఆయకట్టుకు పూర్తిస్థాయిలో సాగునీటిని అందించవచ్చని, చెరువులను కూడా నింపవచ్చని వివరిస్తున్నారు. లేదంటే చివరిదశలో నీరు అవసరయ్యే ప్రధాన సమయంలోనే చేతులేయ్యాల్సిన పరిస్థితి తలెత్తుందని, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు. అదీగాక ఆ సమయంలో ఎత్తిపోసుకుందామన్నా ప్రాణహితలో ప్రవాహాలు కూడా ఆశించిన మేరకు ఉండకపోవచ్చని చెప్తున్నారు.
చివరి ఆయకట్టుకు సాగునీటిని అందించడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. కాలువలపై ఎక్కడిక్కడ రైతులు 3 హెచ్పీ, 5 హెచ్పీ మోటర్లను అమర్చుకొన్నారు. వచ్చిన నీటిని వచ్చినట్టు తమ పొలాలకు మళ్లించుకుంటున్నారు. ఎగువన విడుదల చేసిన జలాల్లో సగం కూడా దిగువకు చేరని పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో పలువురు ఇరిగేషన్ అధికారులు కేవలం 12 గంటలు మాత్రమే కరెంటు ఇవ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు సమాచారం. అలాగైతేనే మోటర్ల ద్వారా నీటితోడివేతను అరికట్టి దిగువకు పూర్తిస్థాయిలో ఇచ్చే అవకాం ఉంటుందని, లేదంటే చేసేదేమీ ఉండబోదని స్పష్టంగా తెలియజేసినట్టు సమాచారం
పోయినేడు కాలువ నిండుగా పారింది. వారానికో మల్క ఇడ్సిన్రు. 5ఎకరాల భూమిలో పత్తి పీకి మక్క వేసుకునేటోన్ని. ఈ యేడు నీళ్లు ఒక్క మల్కనే ఇచ్చిన్రు. అది నాల్రోజులె. కాలువ సుత పూర్తిగ తడవకముందే బంద్ చేసిన్రు. మళ్ల నీళ్లు ఇచ్చేది లేదంటుండ్రు. అందుకు ఈ యేడు మక్క సుత వెయ్యలే.
-గంటి శంకర్, రేగొండ
ఐదేండ్ల సంది ఇప్పుడే చూస్తున్నాం. కాలువల నీళ్లు లేకుండా వానకాలం, యాసంగి కాల్వ నిండా నీళ్లు వచ్చేది. ఈ ఏడు మిరప పంట బాగా దెబ్బతిన్నది. దాన్ని తీసేసి యాసంగి మక్కజొన్న, వరి పొలం సాగు చేస్తున్నాం. నీరు వదిలి పెట్టకుంటే పంటలు పండుడు కష్టమే అవుతది. వారానికి ఒకసారి నీళ్లు వస్తే కాల్వవ తడుసుడుకే సరిపోతది.
– అజ్మీరా శ్రీను, గోపతండా
వారం రోజులు ఒక వైపు మరోవారం మారో కాల్వకు నీళ్లు వదిలి పెడితే. ఎండాకాలం కావడంతో తడిసిన కాల్వ మల్ల తడిసి చెరువులకు నీరు అందే సరికి నీళ్లు బందు అవుతుంది. ఊరకుంటలో గుంతలు నిండేసరికి నీళ్లు బందు కావడంతో వచ్చిన నీళ్లు మల్ల తగ్గిపోయినాయి. కాలకవలో తుంగ, చెత్త తీసేందుకు ఎకరానికి రూ. 500లు వసూలు చేస్తున్నారు. మునుపు ఎప్పుడు గిట్ల మా కానుంచి పైసలు ఎవరు అడగలేదు.
– మంచాల శ్రీను, పడమటిగూడెం