హైదరాబాద్, మే 21(నమస్తే తెలంగాణ) : ‘విజన్ లేని రేవంత్ పాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నరు.. ఒక్క ప్లాట్ కొనుగోలు చేయాలంటేనే ఎన్నారైలు భయపడుతున్నరు’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించారు. గురువారం అమెరికా న్యూజెర్సీలోని హల్దీ-మౌంట్లారెల్లో మీట్ అండ్ గ్రీట్ విత్ హరీశ్రావు కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. సమకాలీన రాజకీయాలు, కేంద్రంలో ప్రాంతీయ పార్టీల పాత్ర, కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని పరిస్థితులు, కేసీఆర్ పదేండ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు తదితర అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నారైల పాత్ర కీలకమని కొనియాడారు. ఆ రోజుల్లో మీరు నైతిక బలాన్ని అందించారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని హరీశ్రావు చెప్పారు. కేసీఆర్ దూరదృష్టితో చేపట్టిన సాగు అనుకూల విధానాలతో పంజాబ్, హర్యానాను తలదన్ని ధాన్యం ఉత్పత్తిలో రికార్డు సృష్టించిందని గుర్తుచేశారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయ వృద్ధి, నీటి పారుదల, విద్యుత్ వినియోగంలో ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ ఆచరిస్తుంది.. భారతదేశం అనుసరిస్తుంది అనేంత గొప్పగా కేసీఆర్ పాలన సాగించారని ప్రశంసించారు. కేసీఆర్ తలపెట్టిన మిషన్ కాకతీయ పథకాన్ని కేంద్రం అమృత్ సరోవర్ పేరిట అమలు చేసిందని గుర్తుచేశారు. మిషన్ భగీరథ పథకాన్ని అమలు చేసి మూడున్నరేండ్లలో ప్రతి ఇంటికీ నీరందించిన ఘనత కేసీఆర్ సర్కార్కే దక్కిందని చెప్పారు. ఈ స్కీమ్ను సైతం కేంద్రం హర్ ఘర్కో జల్ పేరిట దేశవ్యాప్తంగా అమలుచేసిందని పేర్కొన్నారు. తెలంగాణవాళ్లకు పరిపాలన చేతగాదని చెప్పిన వారిని సైతం అశ్చర్యపోయేలా కేసీఆర్ పాలన అందించారని వివరించారు.
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, అన్ని రంగాల్లో తిరోగమిస్తున్నదని హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు ఒక్క ప్లాట్ కొనుగోలు చేయాలంటే భయపడాల్సిన పరిస్థితి ఉన్నదన్నారు. దశ, దిశాలేని ప్రస్తుత సర్కార్ విధానాలతో రియల్ ఎస్టేట్ పడిపోయిందని విమర్శించారు. ఇప్పటికీ ఒక విధానమంటూ లేకుండా ముందుకెళ్లడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇరిగేషన్లో కూడా వెనుకబడిపోవడం బాధాకరమని ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ బీఆర్ఎస్ రావాలంటే, కేసీఆర్ సీఎం కావాలంటే ఎన్నారైలు కీలక పాత్ర పోషించాలని కోరారు.
ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతున్నాయని, దేశ రాజకీయాలను శాసిస్తున్నాయని హరీశ్రావు ఉద్ఘాటించారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు బలోపేతమైతేనే దేశాభివృద్ధి సాధ్యమని చెప్పారు. భవిష్యత్లోనూ కీలకభూమిక పోషిస్తాయని అభిప్రాయపడ్డారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం ఆధారపడాల్సి రావడంతో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నిధులివ్వక తప్పనిసరి పరిస్థితులు ఏర్పడ్డాయని ఉదహరించారు. భవిష్యత్లో బీఆర్ఎస్ కేంద్రంలో ముఖ్య భూమిక పోషించినప్పుడే రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడుతాయని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్, ఎన్నారైలు మహేశ్ తన్నీరు, నర్సింహారావు, భాస్కర్ పిన్న, రవీందర్రావు, అమర్గుండ, పరమేశ్ భీమ్రెడ్డి, చైతన్య చిట్టిమల్ల, వరప్రసాద్, చందు తాళల, పూర్ణ భైరి, నర్సింహారెడ్డి, దొంతిరెడ్డి, రజని తదితరులు పాల్గొన్నారు.