హైదరాబాద్, మార్చి 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం కొత్త రికార్డులు సృష్టిస్తున్నది. ఉష్ణోగ్రతలు భారీగా పెరగడంతో మార్చి మొదటివారంలోనే రికార్డులు బద్దలవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు వినియోగం 298.19 మిలియన్ యూనిట్లుగా నమోదైంది. నిరుడు ఈ సమయానికి అత్యధిక విద్యుత్తు వినియోగం 297.89 మిలియన్ యూనిట్లు. ఈ ఏడాది ఆ రికార్డును అధిగమించినట్టు అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలోనూ ఇదే పరిస్థితి ఉన్నదని అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీలో నిరుడు గరిష్ఠ విద్యుత్తు వినియోగం 59.53 మిలియన్ యూనిట్లు కాగా.. బుధవారం అత్యధికంగా 69.31 మిలియన్ యూనిట్లు నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యధికం. గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ కూడా భారీగా పెరుగుతున్నది. నిరుడు మార్చి 6 నాటికి గరిష్ఠ విద్యుత్తు డిమాండ్ 14,856 మెగావాట్లు ఉండగా, ఈ ఏడాది మార్చి 1 నుంచే 15 వేల మెగావాట్లకుపైగా విద్యుత్తు డిమాండ్ నమోదవుతున్నదని అధికారులు వెల్లడించారు.
బుధవారం ఈ సీజన్లోనే అత్యధికంగా 15,403 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదైందని తెలిపారు. ఇది గత ఏడాది కంటే 573 మెగావాట్లు అధికం. జీహెచ్ఎంసీలోనూ నిరుడు మార్చి 6 నాటికి అత్యధికంగా 2,910 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదుకాగా.. ఈ ఏడాది ఈ నెల 1 నుంచే 3,000 మెగావాట్ల దాటింది. బుధవారం ఈ సీజన్లోనే అత్యధికంగా 3,335 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదైంది. వ్యవసాయంతోపాటు అన్ని క్యాటగిరీల వినియోగదారులకు నిరంతర విద్యుత్తు సరఫరా అందుబాటులో ఉండటంతో వినియోగం భారీగా పెరిగిందని ప్రభుత్వం తెలిపింది. విద్యుత్తు లభ్యత పుషలంగా ఉండటం, ఎండలు పెరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల్లో రోజువారీ వినియోగం 300 మిలియన్ యూనిట్లు దాటే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.