TSRTC | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల తిరుగు ప్రయాణం రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు నిలుపుదల అమల్లో ఉండగా.. దానిని సెప్టెంబర్ 4వ తేదీ వరకు పొడిగించింది. సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ఈ టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది.
పల్లెవెలుగు బస్ ప్రయాణికుల సౌకర్యార్థం టీ-9 పేరుతో రెండు టికెట్లను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9-60, 30 కిలోమీటర్లకు టీ-9-30 టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ టికెట్లు చెల్లుబాటు అవుతాయి. టీ-9-60 టికెట్ను రూ.100కు, టీ 9-30ని రూ.50కి ప్రయాణికులకు సంస్థ అందజేస్తున్న విషయం తెలిసిందే.