హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాఖీపౌర్ణమి సందర్భంగా ప్రయాణికుల రద్దీ దృష్ట్యా టీ-9 టికెట్లను మరో మూడురోజుల పాటు తాతాలికంగా నిలిపివేయాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇప్పటికే ఆగస్టు 29 నుంచి శుక్రవారం వరకు నిలుపుదల అమలులో ఉన్నది. దానిని ఈ నెల 4 వరకు పొడిగించింది. ఇదేనెల 5 నుంచి ఈ టికెట్లు యథావిధిగా కొనసాగుతాయని ప్రకటించింది.
పల్లెవెలుగు బస్ ప్రయాణికుల సౌకర్యార్థం 60 కిలోమీటర్ల పరిధిలో రానుపోను ప్రయాణానికి టీ-9.60, 30 కిలోమీటర్లకు టీ-9.30 టికెట్లను సంస్థ ఇటీవలే అందుబాటులోకి తీసుకువచ్చింది. టీ-9.60 టికెట్ను రూ.100తో, టీ 9.30ని రూ.50తో ప్రయాణానికి వెసులుబాటు కల్పించింది. రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు టికెట్ల జారీకి చాలా సమయం పడుతుందని, అందుకే టీ-9 టికెట్లను తాతాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.