అవమానం నుంచి స్వాతంత్య్రకాంక్ష
సరికొత్త ఆయుధాలతో ఉద్యమబాట
గాంధీజీ మహాభారతంలో శ్రీకష్ణునిలాగే ‘ఆయుధమున్ ధరింప’ అని శపథం చేశారు. సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అహింసా, సత్యాగ్రహమనే రెండు సరికొత్త ఆయుధాలతో గడగడలాడించారు. దక్షిణాఫ్రికాలో ఉద్యమ ఓనమాలు నేర్చుకుని..భారతదేశంలో స్వాతంత్య్రోద్యమానికి ఊపిరిలూదారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిపెట్టి.. ప్రపంచ చరిత్రలోనే మహానాయకుడిగా నిలిచిపోయారు. మండేలా మొదలుకొని మార్టిన్ లూథర్కింగ్ దాకా దేశదేశాల్లో బాపూజీ అడుగుజాడల్లో ఉద్యమాలు నడిచాయి.
మహాత్మాగాంధీ గొప్ప నేత కావడానికి ముందు దక్షిణాఫ్రికాలో ఓ ప్రవాస భారతీయ న్యాయవాది మాత్రమే. అక్కడే ఆయన ఉద్యమాలు నడపడంలో ఓనమాలు దిద్దుకున్నారు. తన వినూత్నమైన అలోచలపై ప్రయోగాలు చేశారు. తన భావి సిద్ధాంతాలకు మెరుగులు దిద్దుకున్నారు. అందుకే దక్షిణాఫ్రికావారు ‘మీరు మోహన్దాస్ను మాకిచ్చారు.. మేము ఆయనను మహాత్మునిగా తీర్చి దిద్ది మీకందించాం’ అంటుంటారు. దక్షిణాఫ్రికాకు చెందిన రచయిత్రి ఫాతిమా మీర్ ఆయన దక్షిణాఫ్రికా జీవితం మీద రాసిన పుస్తకానికి ‘అప్రెంటిస్షిప్ ఆఫ్ ఏ మహాత్మా’ (మహాత్మునిగా తర్ఫీదు) అని పేరుపెట్టారు. గాంధీజీలో మొదటి నుంచీ బ్రిటిష్ వ్యతిరేకత లేదు. బ్రిటిష్ సామ్రాజ్యానికి విధేయులుగా ఉంటామని అన్నారు. బ్రిటిష్వారి యుద్ధాల్లో వలంటీర్గా పాల్గొన్నారు. యుద్ధంలో గాయపడ్డ బ్రిటిష్ సైనికులను స్ట్రెచర్ మీద మోశారు.
మమ్మల్ని సామ్రాజ్యంలోని మిగతావారితో సమానంగా చూస్తే చాలని చెప్పారు. కానీ దోపిడీకి, వివక్షకు అలవాటు పడిన బ్రిటిష్ వారికి ఆ హితవచనాలు ఎక్కలేదు. సరిగ్గా ఆ రోజుల్లోనే ఒక ఘటన జరిగింది. గాంధీజీ..ఫస్ట్క్లాస్ టికెట్ కొనుక్కొని తెల్లదొరల బోగీలో కూర్చున్నారు. టికెట్ కలెక్టర్ వచ్చి ‘నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావ’ని గాంధీజీని నిలదీశాడు. గాంధీజీ టికెట్ ఉందని చెప్తే ‘అదేం కుదరదు’ అంటూ పీటర్మారిజ్బర్గ్ స్టేషన్లో పెట్టేబేడాతో సహా కిందకు తోసేశాడు. ఈ అవమానం గాంధీజీలో ఆవేశాన్ని రగిలించింది. ఆలోచనను తట్టిలేపింది. బ్రిటిష్ పాలకుల నుంచి వలసలు విముక్తి కావడం తప్ప మరో మార్గం లేదనే నిర్ధారణకు వచ్చారు. అయితే శత్రువు శక్తిమంతుడు. సాంప్రదాయిక ఆయుధంతో గెలువలేం. సరికొత్త ఆయుధం కావాలి. అహింసా, సత్యాగ్రహ సిద్ధాంతాలకు దక్షిణాఫ్రికాలోనే పదును పెట్టుకున్నారు. పరీక్షించి చూసుకున్నారు. రోమే రోలా, టాల్స్టాయ్ లాంటి మహామహులతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలు గాంధీజీ తన సిద్ధాంతాలు రూపొందించుకోవడంలో తోడ్పడ్డాయి.
సత్యాగ్రహ పాఠాలు…
1893 నుంచి 1914 వరకు గాంధీజీ దక్షిణాఫ్రికాలో గడిపారు. డర్బన్ సమీపంలోని తన ఫీనిక్స్ ఫావ్ులో ఆయన కార్యకర్తలకు శాంతియుత సత్యాగ్రహంలో శిక్షణ ఇచ్చారు. లాఠీలు, తుపాకుల భాష మాత్రమే తెలిసిన బ్రిటిష్ పాలకులను అహింసాయుత నిరసనతో ఎదుర్కొన్నారు. తర్వాత ఏర్పాటు చేసిన టాల్స్టాయ్ ఫావ్ులో ఆయన సత్యాగ్రహ ఉద్యమం నడపడంలో మరిన్ని మెళకువలను నేర్చుకున్నారు. వివక్ష చూపే ట్రాన్స్వాల్ చట్టానికి వ్యతిరేకంగా 1906, 1907లో భారతీయుల పట్ల సత్యాగ్రహం నడిపారు. ఈ శాంతియుత ఆందోళనలు నడిపినందుకు 1908లో గాంధీజీకి మొదటిసారిగా జైలుశిక్ష పడింది. 1909లో మరోసారి శిక్ష పడింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రవాస భారతీయులను సమీకరించేందుకు లండన్ వెళ్లివచ్చారు. 1913 వరకు ఈ ఆందోళనలు, జైలుశిక్షలు కొనసాగాయి. 1913లోనే ఆయన తన పోరాట పరిధిని విస్తరించుకొన్నారు. క్రైస్తవ వివాహాలకు సంబంధించి తెచ్చిన కఠిన నిబంధనలకు వ్యతిరేకంగా ఆ ఏడాది సత్యాగ్రహం నడిపారు. భారతీయ మైనర్ల అణచివేతకు వ్యతిరేకంగా రెండు వేల మందితో ట్రాన్స్వాల్లో శాంతియుత మహా ప్రదర్శన నిర్వహించారు. ఆ మరుసటి ఏడాదే అంటే 1914లో భారత్కు గాంధీజీ శాశ్వతంగా తిరిగివచ్చారు. దక్షిణాఫ్రికాలో సిద్ధం చేసుకున్న ఆ ఆయుధాలనే మహాత్ముడు భవిష్యత్తులో భారత స్వాతంత్య్ర పోరాటంలో దిగ్విజయంగా ఉపయోగించారు.