ఇరవయ్యో శతాబ్దం తొలి రోజులు..
పంజాబ్ రైతులు అప్పుల్లో పుట్టారు. అప్పుల్లో బతికారు. అప్పులతో మరణించారు. కష్టాల్లో ఉన్న రైతుల్ని మరింత బలిపెట్టే మూడు బ్రిటిష్ నల్లచట్టాలొచ్చాయ్. బ్రిటిష్ వాడిపై గెలిచేదాకా వాటికి వ్యతిరేకంగా ఉద్యమించారు. సాధించారు.
ఇరవై ఒకటో శతాబ్దం తొలి రోజులు..
మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించారు. ఈనాటి పోరాటానికి వందేళ్ల నాటి ‘పగ్డి సంభాల్ జాతా’యే స్ఫూర్తి! ఆనాటి జాతాలాగే ఈనాటి పోరాటం కూడా విజయం సాధించింది.
వరుసగా తలెత్తిన కరువులు, అధిక వడ్డీలు, బ్రిటిష్ ప్రభుత్వ ధన దాహంతో పంతోమ్మిదో శతాబ్దం చివరి రోజుల్లో పంజాబ్ రైతుల ఆర్థిక స్థితి దిగజారడం మొదలైంది. లూథియానా, జలంధర్, అమృత్సర్ జిల్లాల్లోని రైతులు మరింతగా అప్పులపాలయ్యారు. వ్యవసాయదారుల ఆర్థిక స్థితి మరింత దిగజారడంపట్ల పంజాబ్ రైతుల్లో ఆందోళన మొదలైంది. ఈ భయంకరమైన పరిస్థితుల నుంచి బయటపడేందుకు అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులు భూమిని అమ్ముకున్నారు. ఈ పరిస్థితులు ఇరవయ్యో శతాబ్దం తొలినాళ్లలో పంజాబ్ రైతులు ఉద్యమించేందుకు దారితీశాయి.
పేద రైతుల బంజరు సాగు
బ్రిటిష్ వాళ్లు 1879లో చినాబ్ నదిపై లియాల్పూర్కి నీళ్లు పారించేందుకు బారి దోఆబ్ కాలువ నిర్మించారు. ఉచిత భూమిని కేటాయిస్తామని, జనావాసాలు లేని ప్రాంతాల్లో అనేక సౌకర్యాలు కల్పిస్తామని వాగ్దానం చేసి జలంధర్, అమృత్సర్, హోషియార్పూర్ నుంచి రైతుల వలసలను ప్రోత్సహించారు. రుణభారం నుంచి విముక్తి కోరుకున్న రైతులు స్వస్థలాలు విడిచి కొత్త ప్రాంతాల్లో స్థిరపడ్డారు.
రైతు హక్కులు రద్దు
సాగుకు సిద్ధమైన బంజరు భూమికి చినాబ్ నీళ్లొచ్చాయి. భవిష్యత్ బంగారం అనుకున్న రైతుల కంట కన్నీరు పెట్టించే మూడు చట్టాలొచ్చాయి. పంజాబ్ ల్యాండ్ అలియనేషన్ యాక్ట్ (1900), పంజాబ్ ల్యాండ్ కాలనైజేషన్ యాక్ట్ (1906), బారీ దోఆబ్ కెనాల్ యాక్ట్ (1907) రైతుల హక్కుల్ని హరించాయి. వాళ్లు సాగులోకి తెచ్చిన భూముల్లో చెట్టు కొట్టే హక్కు లేదు. ఇళ్లు నిర్మించకూడదు. భూమిని అమ్మకూడదు. ఎవరూ కొనకూడదు. ప్రభుత్వ ఆజ్ఞలు ధిక్కరిస్తే ఆ రైతుని బహిష్కరించి, ప్రభుత్వానికి శిక్షించే అధికారం ఉంది. కోర్టులకు ఈ భూములపై వారసత్వ హక్కు, యాజమాన్య బదిలీ కేసులు విచారించే అధికారం లేదు.
భారత మాతా సొసైటీ
మూడు నల్ల చట్టాలు రైతులకు మరింత నష్టం కలిగించేలా ఉన్నాయి. బారీ దోఆబ్ కెనాల్ చట్టం ద్వారా నీటి పన్ను విధించారు. పంజాబ్ ల్యాండ్ అలియనేషన్ చట్టం భూమి శిస్తుని 25 శాతం పెంచారు. పంజాబ్ ల్యాండ్ కాలనైజేషన్ బిల్లు వీలునామా ద్వారా వారసత్వ ఆస్తిగా భూమిని బదిలీ చేయడాన్ని నిషేధించింది. వీటిని తిప్పికొట్టాలని పంజాబ్ రైతులంతా ఏకమయ్యారు. 20వ శతాబ్దపు తొలినాళ్లల్లో అజిత్ సింగ్, కిషన్ సింగ్ (భగత్ సింగ్ తండ్రి), ఘసితా రావ్ు ‘మెహబూబ్-ఎ-వతన్ (భారత మాతా సొసైటీని)’ని ఏర్పాటు చేశారు. కొత్త చట్టాల గురించి తెలుసుకోవాలనుకునే రైతులను లాహోర్లోని భారత్ మాతా సొసైటీ మందిరానికి ఆహ్వానించారు.
ప్రతి ఆదివారం జరిగే సమావేశాలకు వేలాది రైతులు తరలివచ్చారు. సర్దార్ అజిత్ సింగ్ సంధు (భగత్ సింగ్ మేనమామ) నాయకత్వంలో 22 మార్చి 1907న, లియాల్పూర్లో పంజాబ్ రైతు ఉద్యమం మొదలైంది. ఉద్యమంలోకి రైతులు అసంఖ్యాకంగా చేరారు. మూడు బ్రిటిష్ నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ 1907లో మొదలైన రైతు ఉద్యమం ఏడాదిలోనే పంజాబ్ మొత్తం విస్తరించింది. ఈ సమావేశాల్లో ఝంగ్ సియాల్ ‘పగ్డి సంభాల్ జట్టా’ పద్యాన్ని పఠించడంతో ఈ చారిత్రాత్మక రైతు ఉద్యమానికి ‘పగిడి సంభాల్ జట్టా ఉద్యమం’ అనే పేరొచ్చింది.
నల్ల చట్టాలు వెనక్కి.. రైతులు సాగుకి
మేలో రైతు ఉద్యమం తీవ్రమైంది. దానిని అణచివేసేందుకు లాలా లజపతిరాయ్, అజిత్సింగ్ను అరెస్టు చేశారు. వాళ్లిద్దరిని అరెస్టు చేసి ఆరు నెలల జైలు శిక్ష విధించారు. బర్మాలోని మాండలే జైలులో బంధించారు. కానీ, రైతుల ఆగ్రహం చల్లారలేదు. బ్రిటిష్ ఇండియా సైనిక నియామకాలను దృష్టిలో పెట్టుకుని పంజాబ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో 1907 మే 26న మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టుగా బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ విజయంతో పంజాబ్ ప్రావిన్స్లో 9 నెలలపాటు సాగిన రైతు ఉద్యమం ముగిసింది.
తగ్గేదే లేదన్నారు
రైతు ఉద్యమానికి భయపడి బ్రిటిష్ ప్రభుత్వం చట్టాల్లో కొన్ని సవరణలు చేసింది. కానీ, రైతు ఉద్యమం అందోళన విరమించలేదు. పంజాబ్లో జరిగిన 33 సమావేశాల్లో 19 సమావేశాల్లో అజిత్ సింగ్ ప్రసంగించాడు. రావల్పిండిలో జరిగిన ఒక సభలో.. ‘సవరణలు చేసినందుకు కృతజ్ఞతలు. కానీ, మొత్తం చట్టం రద్దు చేయాలని మేం కోరుతున్నాం. అప్పటి దాకా రైతులెవరూ వ్యవసాయ పన్నులు చెల్లించవద్దు. ఇదే రైతు ఉద్యమం అజెండా’ అని అజిత్ సింగ్ అన్నాడు. పన్నుల నిరాకరణకు ప్రేరేపించినందుకు అజిత్ సింగ్పై విద్రోహం, రాజద్రోహం కేసులు పెట్టారు.