Taapsee Pannu | బాలీవుడ్ నటి తాప్సీ పన్ను మరోసారి తన అభిప్రాయాలతో వార్తల్లో నిలిచారు. ఎలాంటి విషయాన్నైనా నిర్భయంగా చెప్పే తాప్సీ, ఈసారి సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండటానికి గల కారణాలతో పాటు సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వయసు వివక్షపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ‘గాంధారి’ చిత్రంతో బిజీగా ఉన్న తాప్సీ, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సోషల్ మీడియాకు దూరంగా ఉండటం పూర్తిగా తన వ్యక్తిగత నిర్ణయమని వెల్లడించారు. గత ఏడాది నుంచి ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియా వినియోగాన్ని తగ్గించినట్లు తెలిపారు. తాప్సీ మాట్లాడుతూ, “ఆన్లైన్లో తక్కువగా కనిపించాలని గత ఏడాది నిర్ణయం తీసుకున్నాను. దీనికి ప్రత్యేకంగా ఎలాంటి కారణం లేదు. ఇది పూర్తిగా నా వ్యక్తిగత నిర్ణయం. కొంతకాలానికి సోషల్ మీడియా ఒక పరుగు పందెంలా అనిపించడం ప్రారంభమైంది. అందరూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూ, ఎప్పుడూ కనిపిస్తూ ఉండాల్సిందే అన్న ఒత్తిడి పెరిగింది. అందుకే నా జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి, మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి కొంతకాలం సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాను” అని పేర్కొన్నారు.
తన సినీ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ తాప్సీ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హిందీ చిత్రసీమలోకి వచ్చిన తర్వాత మంచి అవకాశాల కోసం చాలా కాలం ఎదురుచూడాల్సి వచ్చిందని చెప్పారు. నేను దాదాపు 25 ఏళ్ల వయసులో బాలీవుడ్లో అడుగుపెట్టాను. అయితే నాకు నచ్చిన పాత్రలు, నటిగా నిరూపించుకునే అవకాశాలు రావడానికి మూడు నుంచి నాలుగు సంవత్సరాలు పట్టింది. ఈలోపు నా వయసు 30 ఏళ్లకు చేరుకుంది. అప్పటికే ఇండస్ట్రీలో కొందరు రొమాంటిక్ కామెడీ సినిమాలకు నేను సరిపోనని, వయసు ఎక్కువైందని వ్యాఖ్యానించారు” అని తెలిపారు.
సినీ పరిశ్రమలో మహిళల పట్ల ఉన్న వివక్షపై కూడా తాప్సీ స్పందించారు. హీరోల విషయంలో వయసు ఎప్పుడూ పెద్ద అంశం కాదని, కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం వయసును ప్రామాణికంగా తీసుకుని అవకాశాలను పరిమితం చేయడం జరుగుతోందని విమర్శించారు.ఒక హీరో 40 లేదా 50 ఏళ్ల వయసులోనూ రొమాంటిక్ పాత్రలు చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారు. కానీ హీరోయిన్ల విషయంలో మాత్రం 30 ఏళ్లు దాటితే కొన్ని రకాల పాత్రలకు పనికిరారని భావించడం ఇప్పటికీ కొనసాగుతోంది. వయసును బట్టి వివక్ష చూపడం సినీ పరిశ్రమలో ఉన్న ప్రధాన సమస్యల్లో ఒకటి” అని తాప్సీ అభిప్రాయపడ్డారు. సామాజిక అంశాలు, మహిళల హక్కులు, సినీ పరిశ్రమలోని అసమానతలపై గతంలోనూ తాప్సీ బహిరంగంగా స్పందించారు.