Pandu Master | ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘ఢీ’ డ్యాన్స్ షో ద్వారా గుర్తింపు పొందిన పండు మాస్టర్ (జి. షణ్ముఖ) ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన విశాఖపట్నంలోని మెడి కవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ప్రమాదానికి గురైన విషయం తెలిసిన వెంటనే రాజకీయ, సినీ ప్రముఖులు స్పందిస్తూ పరామర్శలు కొనసాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నప్పటికీ, ఫోన్ ద్వారా పండు మాస్టర్తో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకుని మళ్లీ తన ప్రతిభతో ప్రేక్షకులను అలరించాలని ఆకాంక్షించారు. కళాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తారని, వారి కష్టసుఖాల్లో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.
మంత్రి సుభాష్ తరఫున ఆయన తండ్రి, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వాసంశెట్టి సత్యం ఆసుపత్రికి వెళ్లి పండు మాస్టర్ను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ తరఫున రూ.50 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.అలాగే వైద్యులతో ప్రత్యేకంగా మాట్లాడి పండు మాస్టర్ ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన అన్ని వైద్య సేవలు అందించాలని సూచించారు. కళాకారుల సంక్షేమం కోసం సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వాసంశెట్టి సత్యం తెలిపారు. సమాజంలోని వివిధ వర్గాలకు సేవా కార్యక్రమాల ద్వారా సహాయం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కళాకారుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కళాకారుల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. ఇదిలా ఉండగా, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా ఆసుపత్రికి వెళ్లి పండు మాస్టర్ను పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడినట్లు సమాచారం. మరోవైపు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సైతం పండు మాస్టర్తో ఫోన్లో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. చికిత్స ఖర్చుల గురించి ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించిన ఆయన, అవసరమైతే అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. డాక్టర్లతో కూడా మాట్లాడి పూర్తి స్థాయి చికిత్స అందేలా చూస్తానని భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది.ఇక తనకు అండగా నిలిచిన మంత్రి వాసంశెట్టి సుభాష్, వాసంశెట్టి సత్యం, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు పండు మాస్టర్ మరియు ఆయన కుటుంబ సభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.