సహాయ నిరాకరణకు గాంధీజీ ఇచ్చిన పిలుపు ఉద్యమరూపం దాల్చింది. దేశమంతటా కొత్తగాలి వీస్తున్నది. హైదరాబాద్ సంస్థానంపై కూడా గాంధీ ప్రభావం పడింది. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా గాంధీ ప్రభావాన్ని అడ్డుకోలేకపోయింది. ఉద్యమం తీరుతెన్నులపై సర్కారు దృష్టిపెట్టింది.
గాంధీ ఫొటోలు పెట్టుకోవడం, గాంధీ టోపీలు ధరించడంతో పాటు మద్య బహిష్కరణ, విదేశీ వస్త్ర బహిష్కరణ, గో సంరక్షణ, చరఖాలు వాడడం, సహాయ నిరాకరణ మొదలైన వాటిని హైదరాబాద్ ప్రభుత్వ న్యాయ, పోలీసు కార్యదర్శి జుల్ఖాదర్ జంగ్ తన నివేదికలో పేర్కొన్నాడు. సాధారణ పరిస్థితుల్లో ఇందులోని పలు అంశాలు సమర్థనీయమైనప్పటికీ ఇప్పటి రాజకీయ వాతావరణంలో దురుద్దేశాలు కనిపిస్తున్నాయని తెలిపాడు. దీనిని బట్టి గాంధీ ఉద్యమ ప్రభావానికి అప్పటి ప్రభుత్వం ఎట్లా ఉలిక్కిపడిందో తెలుస్తున్నది.
గాంధీ ప్రభావంపై సమీక్షించేందుకు హైదరాబాద్ సంస్థాన ఉన్నతాధికారులు 1921 ఆగస్టు 28న సమావేశమయ్యారు. ఉద్యమాన్ని మొగ్గదశలోనే అణచివేయకపోతే సంస్థానంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఉద్యమాన్ని కట్టడి చేసేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని సూచించింది. తదనుగుణంగా పోలీసు శాఖను మూడు విభాగాలుగా విభజించి, బ్రిటిష్ రెసిడెన్సితో అనుసంధానానికి ఒక అధికారిని నియమించారు. సందర్భానుసారంగా నిషేధాజ్ఞలు విధించే అధికారం పోలీసు అధికారులకే అప్పగించారు. బడి పిల్లలపై కన్నేసి ఉంచాలని, కొత్తగా పాఠశాలలు ప్రారంభించేవారు నేపథ్యం తెలుసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
భారీగా చరఖాల వాడకం..
ప్రజలు భారీ ఎత్తున చరఖాలు వాడుతున్నారని పోలీసు శాఖకు నివేదికలు అందాయి. కొందరు చరఖాలను తయారు చేస్తుంటే, కొందరు బాలికలకు వాటిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వడం సాగుతున్నది. అయితే, చరఖా ఉద్యమం ఇట్లానే సాగితే, కష్టమేనని ప్రభుత్వం భావించింది. అందుకే వీరి సహాయ నిరాకరణ కార్యకలాపాలపై నిఘా వేయాలని ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అధ్యక్షుడు అలీ ఇమామ్ ఆదేశించారు. వివేకవర్ధిని హాలులో మహమ్మద్ అస్గర్ అధ్యక్షతన జరిగిన ఉగాది పండుగ ఉత్సవాలకు హిందువులు, ముస్లింలు భారీగా హాజరయ్యారు.
ఖద్దరు ధారణ గురించి మాట్లాడారు. ఈదు జువా, రాఖీ పున్నమి కార్యక్రమాలు జరిగాయి. ఆ తరువాత మరో సందర్భం పేర సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాల్లోనూ ఖద్దరు ధారణతో కొన్ని ఇతర అంశాలు మాట్లాడారు. 1921 అక్టోబర్ రెండో తేదీన ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే ఉద్యమకారులు గాంధీ జన్మదినాన్ని నిర్వహించారు. అంటరానితనాన్ని నిర్మూలించాలని అన్నారు. కొందరు ఖిలాఫత్ పాలన గురించి మాట్లాడారు. క్రమంగా విదేశీ వస్త్ర బహిష్కరణ, మద్య నిషేధం, సహాయనిరాకరణ లాంటి కార్యక్రమాలు పెరిగిపోయాయి.